వైఎస్సారే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌

YSR

తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌భావం త‌మపై ప‌డ‌కుండా చూసుకునే దిశ‌గా అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ మాట‌ల‌కు ప‌దును పెడుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌ల్లో దూకుడు పెంచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో జ‌ల వివాదంతో పాటు ష‌ర్మిల కొత్త పార్టీ విష‌యంలోనూ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌యోజనం పొందాల‌ని టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది.

కృష్ణా జ‌లాల విష‌యంలో మ‌రోసారి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం రాజుకున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అక్ర‌మంగా ప్రాజెక్టులు క‌డుతుందంటూ తెలంగాణ వాదిస్తుండ‌గా.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ విద్యుతుత్ప‌త్తి చేస్తుంద‌ని ఏపీ అంటోంది. నిబంధ‌న‌ల మేర‌కే న‌డుచుకుంటున్నామంటూ రెండు రాష్ట్రాలూ ప‌ట్టుబ‌ట్టుకుని కూర్చున్నాయి.

అంతే కాకుండా ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ మంత్రులు.. ఏపీ సీఎం జ‌గ‌న్ తండ్రి వైఎస్సార్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుల నిర్మాణం అక్ర‌మంగా చేప‌డుతుందోంటూ ఏపీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న తెలంగాణ మంత్రులు.. వైఎస్సార్ దొంగ అయితే జ‌గ‌న్ గ‌జ‌దొంగ అని, వైఎస్సార్ న‌ర‌రూప రాక్ష‌సుడంటూ తీవ్రస్థాయిలో మండిప‌డుతున్నారు. త‌మ‌కు రావాల్సిన వాటా కోసం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఏపీతోనే కాదు అవ‌స‌ర‌మైతే దేవుడితోనైనా కొట్లాడ‌తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ‌లో రాజన్న పాల‌న తెస్తానంటూ వైఎస్ త‌న‌య ష‌ర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పార్టీ ప్ర‌భావం తెలంగాణలో పెద్ద‌గా ఉండ‌ద‌ని భావిస్తున్నప్ప‌టికీ.. టీఆర్ఎస్ ముందు జాగ్ర‌త్త‌గా ఆ పార్టీపైనా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు.. వైఎస్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలంగాణ‌ను అవ‌మాన ప‌రిచార‌ని, తెలంగాణ ఇవ్వ‌డ‌మంటే బీడీ, సిగ‌రెట్ ఇవ్వ‌డ‌మా అని ఎద్దేవా చేశార‌ని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. అలాంటి వైఎస్ వార‌సుల‌కు తెలంగాణ‌లో స్థానం లేద‌ని చెప్పారు. వైఎస్ వార‌సుల‌మంటూ కొంత‌మంది వ‌స్తున్నార‌ని, వాళ్ల‌కు తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు వైఎస్సార్ బ‌తికుంటే తెలంగాణ వ‌చ్చేది కాద‌ని ఇప్ప‌టికీ మాట‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

మొత్తానికి వైఎస్సార్‌ను లక్ష్యంగా చేసుకుని ప్ర‌యోజ‌నం పొందాల‌ని భావిస్తున్న తెరాస ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయో లేదో చూడాలి. మ‌రోవైపు రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తమ రాజకీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌ల వివాదాల‌ను పెద్ద‌దిగా చేస్తున్నార‌ని, కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే స‌మ‌స్య‌ను అతిగా చేసి చూపిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.