భ‌ట్టి వ‌ర్సెస్ రేవంత్‌.. రీజ‌నేంటి..?

Bhatti Vikramarka

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే.. మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు రేవంత్‌రెడ్డికి సీనియ‌ర్ల నుంచి స‌పోర్ట్ ఉండే ప‌రిస్థితి లేదు. ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు సైతం రేవంత్ ఎంపిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేత‌ల‌ను క‌లుస్తూ స‌ర్దిచెప్పుకుంటూ వ‌స్తోన్న రేవంత్‌పై ఇప్పుడు మ‌రో కీల‌క నేత క‌త్తిదూస్తోన్న ప‌రిస్థితి. అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ చీఫ్‌గా ఉన్న మాజీ మంత్రి భ‌ట్టివిక్ర‌మార్క‌కు ప‌డ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన భ‌ట్టి కాంగ్రెస్‌లో చాలా సీనియ‌ర్‌. ఆయ‌న సోద‌రుడు మ‌ల్లు ర‌వి కూడా పార్టీలో కీల‌క నేత‌. అయితే.. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో అంద‌రిలోనూ ఉన్న‌ట్టే.. భ‌ట్టి విక్ర‌మార్క కూడా కొంద‌రి పేర్ల‌ను సూచించారు.

వారిని కాద‌ని.. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన రేవంత్‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌డం భ‌ట్టి వ‌ర్గానికి ఇష్టం లేదు. అంతే కాదు.. త‌న సొంత జిల్లాలో మాజీ ఎంపీ రేణుక‌తో విభేదించే భ‌ట్టి.. రేవంత్‌ను రేణుక వ‌ర్గంగానే చూస్తున్నారు. ఆయ‌న‌కు పీసీసీ రావ‌డం వెనుక రేణుక ప్ర‌మేయం కూడా ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. రేణుక ముందు నుంచి రేవంత్‌కు స‌పోర్ట్ చేస్తుండ‌డంతో పాటు జిల్లా కాంగ్రెస్‌లో కొన్ని వ‌ర్గాల‌ను ఎద‌గ‌నీయ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఢిల్లీలో ప‌ట్టు ఉండ‌డంతో రేవంత్‌కు ప‌ద‌వి వ‌చ్చే విష‌యంలో త‌న వంతుగా చ‌క్రం తిప్పార‌ని పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే రేవంత్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో రేణుక ఇంట్లో స‌మావేశం నిర్వ‌హించి.. ఆహ్వానించినా.. భ‌ట్టి మాత్రం రాలేదు. అంతేకాదు.. ఆయ‌న వ‌ర్గంగా ఉన్న కొంద‌రు నేత‌లు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేదు. ఇక‌, సీనియ‌ర్లను క‌లిసి ఆశీస్సులు తీసుకుంటున్న రేవంత్ .. భ‌ట్టిని క‌లిసేందుకుప్ర‌య‌త్నించ‌గా.. ఆయ‌న ఛాన్స్ ఇవ్వ‌లేదు. దీంతో మ‌ల్లు ర‌వి జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ రెండు ప‌రిణామాల‌తోనూ రేవంత్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఆల్‌రెడీ భ‌ట్టిపై అక్క‌సుతో ఉన్న రేణుకా చౌద‌రి వ‌ర్గం.. రేవంత్ కు ద‌గ్గ‌ర‌వుతోంది.

ఈ ప‌రిణామం భ‌ట్టికి న‌చ్చ‌డం లేదు. దీంతో రేవంత్ వ‌ర్సెస్ భ‌ట్టి అనే స్థాయిలో రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన నాయ‌కులు.. ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఖ‌మ్మం రాజ‌కీయాలేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిణామం ఎటు దారితీస్తుందో ? చూడాలి.