జెండా ఎత్తేయటమేనా ?

తెలంగాణాలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన వ్యవహారమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత తెలంగాణాలో జనసేన పార్టీ నడిపే విషయంలో చేతులెత్తేసినట్లు అర్ధమైపోతోంది. అప్పటికేదో ఏపిలో పార్టీ పరిస్ధితి బ్రహ్మాండంగా ఉందని అనుకునేందుకు లేదు. కాకపోతే పార్టీ నిర్వహణ కష్టంగా ఉందని ఏపి విషయంలో ఇంకా ప్రకటించలేదంతే.

పార్టీ పెట్టినప్పటినుండి ఏ రోజు కూడా పవన్ సీరియస్ రాజకీయాలు చేసింది లేదు. ఎప్పుడో ఒకసారి జనాల్లో తిరగటం, మీడియాతో మాట్లాడటం మళ్ళీ కొద్ది రోజులు అడ్రస్ లేకుండా మాయమైపోవటం పవన్ కు బాగా అలవాటే. గట్టిగా నాలుగురోజులు జనాల్లో తిరిగితే చాలు మళ్ళీ నెలరోజుల దాకా కనబడని సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జనసేనను చాలా లైట్ గా తీసుకున్నారు.

పార్టీ వాళ్ళే లైట్ గా తీసుకున్నాక ఇక మామూలు జనాలు ఎందుకు పట్టించుకుంటారు. అందుకనే ఏకంగా రెండుచోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ణే జనాలు ఓడించారు. ఒక కాలు సినిమాల్లో మరోకాలు రాజకీయాల్లో పెట్టిన కారణంగానే ఏరోజు సీరియస్ కాదు. పైగా సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని జనాలు కూడా బాగానే అర్ధం చేసుకున్నారు.

తెలంగాణాలో పార్టీని జనాలు పట్టించుకోవటంలేదని గ్రహించినట్లున్నారు. అందుకనే వేల కోట్ల రూపాయలతో ముడిపడున్న ప్రస్తుత రాజకీయవ్యవస్ధలో పార్టీ నిర్మాణం తనకు కష్టంగా ఉందని చెప్పేసింది. తెలంగాణాలో అయినా ఏపీలో అయినా పార్టీ పరిస్ధితి ఒకేలాగుంది. మిత్రపక్షం బీజేపీ కూడా అవసరమైనపుడు తప్ప ఏపిలో జనసేనను అసలు పట్టించుకోవటమే లేదు. తెలంగాణాలో అయితే జనసేనను బీజేపీ ఓ పార్టీగానే గుర్తించటంలేదు. మొత్తానికి తెలంగాణాలో పార్టీని మూసేసే రోజు దగ్గరలోనే ఉందని అర్ధమైపోతోంది.