ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక, గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలపైనా తన పట్టును కొనసాగిస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలానే.. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా నేరుగా గ్రామీణ ప్రాంతాలకే అందిస్తున్నారు.
ఇలా..తనదైన శైలిలో పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఇక, ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురంపై మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గత 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత.. పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. పండుగులు, శ్రావణ మాసాలను పురస్కరించుకుని పట్టుచీరలు పంపిణీ చేయడం.. సంప్రదాయ వేడుకల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం వంటివి తెలిసిందే.
అయితే.. పిఠాపురాన్ని మరింత డెవలప్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్.. ‘పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ(పీఏడీఏ)’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) ఎలా పనిచేస్తుందో.. పీఏడీఏ కూడా అలానే పనిచేస్తుంది. ఈ సంస్థకు కూడా నిధుల వినియోగం నుంచి పనులు చేయించడం వరకు బాధ్యతలు ఉంటాయి. అంతేకాదు.. అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.
ఏం చేస్తారు.. ?
కేంద్రం నుంచి వస్తున్న పంచాయతీ నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకు అందించినట్టే.. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నిధులను నేరుగా పీఏడీఏకు బదిలీ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రాజెక్టు డైరెక్టర్గా నియమిస్తారు. రహదారులు..మౌలిక సదుపాయా లే కాదు.. పిఠాపురాన్ని పర్యాటక ప్రాజెక్టుగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్రంలో ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం.. ప్రత్యేకంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates