టీఆర్ఎస్ హయాంలో బాబు కు మించిన ఫలితాలు

హైద‌రాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి అంటే త‌న పుణ్య‌మేన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు అవాక్క‌య్యేలా దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రంగం ఎగుమ‌తులు సాధించింది. పైగా ఈ ఫ‌లితాలు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉన్న స‌మ‌యంలోనే వెలువ‌డటం గ‌మ‌నార్హం. గ‌త ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. చివరి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది.

ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం.

జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ట్రాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది.

కాగా, హైద‌రాబాద్‌లో ఐటీ అభివృద్ధి ప్ర‌దాత‌గా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించుకున్నారు. ఓ ద‌శ‌లో రాష్ట్రం విడిపోతే ఐటీ అభివృద్ధి సైతం ఆగిపోతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధి‌కారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదే రీతిలో ఐటీ ఊపు కొన‌సాగింది.

అంతేకాకుండా ఐటీ రంగం మునుపెన్న‌డూ లేనంత వృద్ధి చెందుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌డం, కాక‌తాళీయంగా ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు హైదరాబాదులో ఉండ‌టం గ‌మ‌నార్హం.