రుణపరిమితిలో భారీ కోత.. ఏపీ సర్కారుకు కేంద్రం భారీ షాక్

దేశంలో మరెక్కడా లేని రీతిలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో లబ్థిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు వేసే వినూత్న విధానాన్ని ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బోలెడంత చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా క్యాలెండర్ ఏర్పాటు చేసి.. నెల వారీగా పథకాల్ని అమలు చేస్తున్నారు.

అయితే.. ఈ పథకాల అమలుకు ఆదాయం కంటే కూడా అప్పుల మీదనే ఎక్కువగా ఆధారపడుతోంది వైఎస్ జగన్ సర్కార్. అయితే.. ఈ విమర్శల్ని ఏపీ ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల వారిని పెద్ద మనసుతో ఆదుకోవటాన్ని వక్రీకరించి చెబుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తోంది. ఇదిలా ఉంటే.. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులకు సంబంధించి తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందిని కలుగజేస్తోంది.

ఆదాయం కంటే కూడా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ రుణ పరిమితులపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత సంవత్సరంలో మాదిరి ఈ ఏడాది కూడా రూ.42,742 కోట్ల అప్పును తెచ్చుకునేలా కేంద్రం కోరింది వైసీపీ సర్కారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వినతిని కేంద్రం కొట్టేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణ పరిమితిని పెంచేది లేదని స్పష్టం చేయటమే కాదు.. మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) రూ.42,742 కోట్ల రుణాలు తెచ్చుకోవటానికి వీలుగా కేంద్రాన్ని ఏపీ సర్కారు అడిగితే.. రూ.37,163 కోట్లకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.32,669 కోట్లకు తగ్గించింది. తాజాగా ఈ పరిమితిని మరింత తగ్గిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.27,669 కోట్లు మాత్రమే అప్పు చేయాలని.. అంతకు మించి చేయటానికి వీల్లేదని చెప్పటం గమనార్హం. ఇదే తీరులో కేంద్రం తీరు ఉంటే.. ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది.