కో వ్యాగ్జిన్ ట్రయల్స్.. పిల్లలపై వద్దు..!

దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు.. కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అయితే.. త్వరలోనే 17ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. క్లినికల్ ట్రయల్స్ పై ఆంక్షలు విధించింది. రెండు నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై కోవోవాక్స్ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

ఈ మేరకు పిల్లలపై టీకా రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేసింది. కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌ను రెండు నుంచి 17ఏళ్లలోపు ఉన్న 920 మంది పిల్లలపై జరిపేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ సోమవారం డీసీజీఐ అనుమతి కోరిన విషయం తెలిసిందే.

12 నుంచి 17 ఏళ్ల లోపున్న460 మందిపై, రెండు నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై దేశవ్యాప్తంగా 10 చోట్ల ట్రయల్స్ చేపట్టేందుకు అనమతి ఇవ్వాలని సీరం కోరింది. తాజాగా ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవోవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదనే విషయాన్ని గుర్తించింది. దీంతో పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్‌కు ముందు ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవొవాక్స్‌’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్చిలో 18ఏళ్లు పైబడినవారిపై టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది. జులై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని సీరమ్‌ భావించింది. ఇప్పటికే సీరమ్‌ కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తోంది.