మంత్రులకు షర్మిల మద్దతిస్తున్నట్లేనా ?

Sharmila

తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల జగడాలపై వైఎస్ షర్మిల స్పందన చూస్తుంటే మంత్రుల వాదనకు మద్దతిస్తున్నట్లే ఉంది. తెలంగాణాకు సంబంధించిన ఒక్క నీటిచుక్కను కూడా వదులుకునేది లేదని షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు. ట్విట్టర్ వేదికగా జలజగడాలపై ఆమె స్పందించారులేండి. అవసరమైతే ఎవరితో అయినా పోరాడేందుకు సిద్ధమే అని ప్రకటించేశారు.

జల వివాదాలేమిటి ? వివాదం నిజంగానే రాజుకుంటున్నదా అన్న విషయాలను పక్కనపెట్టేస్తే తెలంగాణా మంత్రులు వైఎస్సార్+జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నది వాస్తవమే కదా. వైఎస్సార్ ను రాక్షసుడని, నరరూపరాక్షసుడని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడారు. పనిలో పనిగా జగన్ను కూడా తిట్టేస్తున్నారు. తండ్రీ, కొడుకులను కేసీయార్ పల్లెత్తు మాటనకుండా తన మంత్రులతో తిట్టిస్తున్నది బహిరంగ రహస్యమే.

ఒకవైపు మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ఏపి మంత్రులేమో తాము తెలంగాణాకు చెందిన జలాలను దొంగతనం చేయటంలేదంటు మొత్తుకుంటున్నారు. ఏపీ వాటకు మించి ఒక్క గ్లాసు నీళ్ళు కూడా తీసుకోవటం లేదంటు మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరి మంత్రుల్లో ఎవరి ఆగ్రహం, ఎవరి వాదన నిజమో తేల్చాల్సింది కేంద్రం+ ఉన్నతాధికారులే. ఇలాంటి నేపధ్యంలో హఠాత్తుగా షర్మిల కూడా రంగంలోకి దూకేశారు.

ఇప్పటికే తాను వెనకబడిపోయినట్లు ఫీలయ్యారేమో. అందుకనే పోరాటమని, నీటిచుక్కను కూడా వదులుకునేది లేదని ట్విట్టర్లో స్పందించేశారు. జల జగడాలపై ఆమె స్పందన చూసిన తర్వాత తెలంగాణా వాటా నీటిని ఏపి అక్రమంగా వాడేసుకుంటోందని నిర్ధారించేసుకున్నట్లే ఉంది. ఆమె ఎవరితో మాట్లాడి నిర్ధారించుకున్నారో ఏమో తెలీదు.

ఇదే నిజమైతే ఇన్నిరోజులు వైఎస్సార్+జగన్ను తెలంగాణా మంత్రులు తిడుతున్నది కరెక్టే అని జనాలు అనుకోవాలి. తండ్రి, కొడుకులను మంత్రులు తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించటాన్ని షర్మిల అంగీకరిస్తున్నారా ? అనే సందేహం పెరిగిపోతోంది. మరి వైఎసార్ అభిమానులు, మద్దతుదారులు షర్మిల వాదనను అంగీకరిస్తారా ? ఏమో చూద్దాం ఏమి జరుగనుందో.