కేసీఆర్ మనమడికి ప్రతిష్టాత్మక అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు హిమాన్షు మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించటం లేదు. కరోనాకు ముందు వరకు అడపాదడపా వార్తల్లో మెరిసే వారు. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు అతడి ఊసే కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. తాజాగా ఒక స్వీట్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. ‘సోమా’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు ప్రతిష్టాతమ్మక డయానా పురస్కారాన్ని సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.

తనకు పురస్కారం వచ్చినట్లుగా హిమాన్షునే స్వయంగా సోషల్ మీడియా ట్విటర్ లో పేర్కొన్నారు. తాను విజయవంతం కావటంలో కారణమైన మార్గదర్శకుడైన తాత కమ్ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఇంతకీ ఈ అవార్డు ఏమిటి? దాన్ని ఎందుకు ఇస్తారు? ఏం చేసినందుకు ఈ పురస్కారం సొంతమైంది? ఈ పురస్కారానికి ఉన్న ఇమేజ్ ఎంత? లాంటి సందేహాలకు సమాధానాలు వెతికితే..

ఆహార ఉత్పత్తుల్లో కల్తీ అంశంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించటం.. కల్తీ లేని ఉత్పత్తులను చేయటంలో వారు సాధికారత సాధించేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ పురస్కారాన్ని పాతికేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన వేల్స్ యువరాణి డయానా పేరు మీద ఏర్పాటు చేశారు. తొమ్మిది నుంచి పాతికేళ్ల లోపు వయసున్న యువతీ యువకులు తాము చేస్తున్నసామాజిక కార్యక్రమాల్ని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు.

చిన్న పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల్లో పేదరికం లేకుండా చేయటం.. స్వయం ఉపాధి కల్పించి ఆకలి సమస్య లేకుండా చేయటం.. కల్తీ లేని ఆహార ఉత్పత్తుల్ని వాడేలా ప్రోత్సహించటం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని గంగాపూర్ – యూసుఫ్ ఖాన్ పల్లిలో చేయటం.. దాని కారణంగా పురస్కారం రావటంతో ఈ గ్రామాల వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు హిమాన్షు. తాను అమితంగా ప్రేమించే మనమడు సాధించిన పురస్కారానికి సీఎం కేసీఆర్ తెగ ఖుషీ అయిపోతారన్న మాట వినిపిస్తోంది. చూస్తుండగానే హిమాన్షు పెద్దోడు అయిపోతున్నాడే!