హిడెన్ అజెండా సక్సెస్ అవుతుందా ?

తెలంగాణా మంత్రులు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని హిడెన్ అజెండాను అమలు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. మొదటిదేమో హుజూరాబాద్ లో తొందరలోనే జరగబోయే ఉపఎన్నిక. ఇక రెండోదేమో షర్మిల పెట్టబోయే పార్టీ విషయంలో జనాల మైండ్ సెట్ ను ముందుగానే సెట్ చేసే ప్రయత్నం. రాజకీయపార్టీల నేతల ఆలోచనల ప్రకారం రానున్న సెప్టెంబర్ మాసంలో హూజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటం ఈటల రాజేందర్ కన్నా కేసీయార్ కే ఎక్కువ ప్రిస్టేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఈటల ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమైపోయింది. తనను ధక్కరిస్తున్న ఈటల ఇక్కడ గెలిస్తే కేసీయార్ ఇజ్జతంతా దెబ్బకు నేలమట్టమైపోతుంది. కేసీయార్ ఇమేజికి బాగా డ్యామేజి అవుతున్న నేపధ్యంలో జరగబోతున్న ఉపఎన్నిక కాబట్టే గెలుపుకోం మళ్ళీ జనాల్లో సింటిమెంటును రాజేయటం ఒకటే మార్గం.

ఇందుకనే తెలంగాణా-ఏపి మధ్యలో జల వివాదాలను హఠాత్తుగా తెరపైకి మంత్రులు తెచ్చి జగన్ తో పాటు దివంగత సీఎం వైఎస్ ను కూడా మంత్రులు నోటికొచ్చినట్లు తిడుతున్నారు. జగన్ +వైఎస్సార్ పై కేసీయార్ తాను నోరిప్పకుండానే మంత్రులతో తిట్టిస్తున్నారు. మరిది హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

ఇక షర్మిల అంశం తీసుకుంటే జూలైలో పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణాలో కూడా రాజన్న పాలన అన్న ట్యాగ్ లైనతో షర్మిల రాజకీయాలు మొదలుపెట్టేశారు. ఒకవైపు కేసీయార్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తునే మరోవైపు తెలంగాణా అంతా తిరుగుతున్నారు. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి షర్మిల పార్టీవైపు జనాలు చూడకుండా ఉండాలంటే తెలంగాణాకు వైఎస్సార్, జగన్ తీరని అన్యాయం చేసినట్లు ఆరోపణలు చేయాల్సిందే.

అందుకనే మంత్రులు వైఎస్సార్ ను పదే పదే టార్గెట్ చేయటం వెనుక షర్మిల పెట్టబోయే పార్టీని ఇప్పటినుండే బద్నాం చేయటం కూడా ఉంది. అంటే మంత్రుల తిట్లదండకంలో ఇటు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో సెంటిమెంటు, అటు షర్మిల పెట్టబోయే పార్టీ వైపు జనాలు పోకుండా చూడటం అనే రెండంచెల హిడెన్ అజెండా ఉందని అర్ధమైపోతోంది. మరి వీళ్ళ అజెండా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.