జ‌గ‌న్‌కు రెడ్లు దూర‌మ‌వుతున్నారా?

ఏ వ‌ర్గం ఆశీస్సుల‌తో వైసీపీ నేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు చిర్రుబుర్రులాడుతోంది. ఏ వ‌ర్గం ఆయ‌న‌ను సీఎంగా చూడాల‌ని త‌పించిపోయిందో.. ఆ వ‌ర్గ‌మే ఇప్పుడు ఆయ‌న‌పై క‌స్సుబుస్సులాడుతోంది. “మావోడి వ‌ల్ల మాకేంటి?” అని నేత‌లు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. అదే రెడ్డి సామాజిక వ‌ర్గం. వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రెడ్డి వ‌ర్గం.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై పైకి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా.. లోలోన మాత్రం ర‌గిలిపోతోంది.

“మేం అనుకున్న విధంగా పాల‌న లేదు. అస‌లు మేం ఉన్నామ‌నే విష‌యాన్ని జ‌గ‌న్ గ‌మ‌నించ‌డ‌మే లేదు. ప్ర‌జ‌లే త‌న‌కు అధికారం ఇచ్చార‌ని అనుకుంటున్నారు. కానీ, ప్ర‌జ‌ల‌ను వైసీపీవైపు.. జ‌గ‌న్‌పైపు మలుపు తిరిగేలా క్షేత్ర‌స్థాయిలో మేం ఎంత క‌ష్ట‌ప‌డ్డామో.. ఆయ‌న గ‌మ‌నించ‌డం లేదు. ఆయ‌న ఇష్టం.. చేసుకోమ‌నండి..”- ఇదీ. నెల్లూరుకు చెందిన కీల‌క రెడ్డి నాయ‌కుడు ఇటీవ‌ల బ‌హిరంగంగానే చేసిన వ్యాఖ్య‌లు. ఈయన ఒకింత త‌న అస‌హ‌నాన్ని బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కినా.. ఎంతో మంది రెడ్డి నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

“నేను మాకున్న ప‌దెర‌కాల పొలాన్ని అమ్మేసి.. పోటీ చేశా. గెలిచా. ఇప్పుడు చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. మ‌ళ్లీ పుంజుకుంటాములే అనుకున్నా. ప్ర‌భుత్వం అయితే.. వ‌చ్చింది. మ‌మ్మ‌ల్ని చూసే నాథుడు క‌నిపించ‌డం లేదు. క‌నీసం మా మొహం చూపిద్దామ‌న్నా.. సీఎం సార్ బిజీ. అలాగే ఉండ‌నీయండి. ఎన్నాళ్లు ఉంటారో మేమూ చూస్తాం!” ఇదీ.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ రెడ్డి నేత ఆవేద‌న‌.

ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గం వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పేరుతో జ‌గ‌న్ చేస్తున్న విన్యాస‌మే. జ‌న‌ర‌ల్ కు కేటాయించిన స్థానాల‌ను కూడా బీసీ సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించ‌డం త‌మ‌కు క‌నీస ప్రాధాన్యం లేకుండా చేయ‌డం వంటి విష‌యంపై గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే గ‌తంలో టీడీపీలో ఉన్న సీనియర్ నాయ‌కుడు ఇటీవ‌ల “నేను పార్టీలో ఉన్నానంటే ఉన్నాను. ఏం చేస్తాం. మ‌రో మార్గం లేదు!” అనేశారు.

ఇలా మొత్తంగా రెడ్డి సామాజిక వ‌ర్గం.. జ‌గ‌న్‌పై తీవ్ర అస‌హ‌నంతో ఉంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎంగా జ‌గ‌న్ చూసుకోవాల‌ని త‌పించిపోయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక మంది పెట్టుబ‌డులు కూడా పెట్టారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ కోవ‌లో ఉన్నారు. అయితే.. అమ‌రావ‌తి పై సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో రియ‌ల్ రంగం కుదేలైంది. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టినా.. వాటి కాంట్రాక్టులు తీసుకుని.. ప‌ని చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ.. ప్ర‌భుత్వం అస‌లు అభివృద్ధి మంత్రాన్ని పక్క‌న పెట్టేసింది. దీంతో రెడ్డి వ‌ర్గం.. పూర్తిగా యూట‌ర్న్ తీసుకునే ప‌రిస్థితిలో ఉంది. అయితే.. ఇక్క‌డ వీరికి ఉన్న ప్ర‌దాన మైన‌స్ ఆల్ట‌ర్నేట్ లేక పోవ‌డ‌మే! సో.. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.