గూగుల్ – జియో భాగ‌స్వామ్యంతో మ‌రో ఫోన్‌..

భారీ అంచనాల నడుమ జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటనలు చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అందరూ ఊహించినట్లుగానే గూగుల్-జియో భాగస్వామ్యంతో బడ్జెట్ 4జీ స్మార్ట్ఫోన్ ఫోన్ వివరాలు సహా సంస్థ బోర్డ్లోకి సౌదీ ఆరాంకో ఛైర్మన్ను చేర్చుకునే అంశంపై స్పష్టత ఇచ్చింది. వీటితో పాటు కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై అంచ‌నాలు వేసుకున్నారు.

3.24 ల‌క్ష‌ల కోట్లు..

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వ సభ్య సమావేశం గురువారం జరిగింది. ఇందులో కంపెనీ భావిష్యత్ ప్రణాళికలతో పాటు త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న కొత్త ఉత్పత్తుల వివరాలను ప్రకటించింది. జియో ప్లాట్ఫామ్స్, రిటైల్ వెంచర్ విభాగాల్లో.. క్యాపిటల్ ఈక్విటీ విక్రయం, రైట్స్ ఇష్యూ, అసెట్ మానిటైజేషన్ ద్వారా ఏడాది కాలంలో రూ.3.24 లక్షల కోట్లు సమీకరించినట్లు ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకున్న కంపెనీ ఆర్ఐఎల్ మాత్రమేనని పేర్కొన్నారు.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద పెట్టుబ‌డి..

“రిలయన్స్‌ గతేడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కంపెనీ సమీకృత ఆదాయం రూ.54,000 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఈబీఐటీడీఏ రూ.98,000 కోట్లుగా నిలిచింది. వీటిల్లో 50శాతం కన్జ్యూమర్‌ వ్యాపారం నుంచే లభించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6.8శాతం వాటాను అందించింది. మా కంపెనీలో 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఇక కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకం కింద రూ. 21,044 కోట్లు, జీఎస్‌టీ కింద రూ. 85,306 కోట్లు, వ్యాట్‌ రూపంలో రూ.3,213 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాం. రూ.3,24,432 కోట్ల మూలధనాన్ని తీసుకొచ్చాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి“ అని ముఖేష్ అంబానీ అన్నారు.

సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్..

నిధుల సమీకరణతో పాటు భారీ పెట్టుబడి ప్రణాళికను కూడా ప్రకటించారు ముకేశ్ అంబానీ. కర్బన రహిత విద్యుత్(గ్రీన్ ఎన‌ర్జీ) ఉత్పత్తి కోసం.. వచ్చే మూడేళ్లలో రూ.75 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సోలార్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తికి గానూ.. నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 2030 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు.

20 శాతం వాటా విక్ర‌యం

సౌదీ ఆరాంకో-ఆర్ఐఎల్ డీల్పైనా ముకేశ్ అంబానీ స్పష్టతనిచ్చారు. సంస్థ ఆయిల్ టూ కెమికల్ (ఓ2సీ) విభాగంలో 20 శాతం వాటాను.. సాదీ ఆరాంకోకు 15 బిలియన్ డాలర్లకు విక్రయించే ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తవనున్నట్లు తెలిపారు. దీనితో సౌదీ ఆరాంకో ఛైర్మన్, సౌదీ పెట్టుబడి సంస్థ.. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) అధినేత యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్లో స్వతంత్ర డైరెక్టర్గా చేరనున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు.

సుంద‌ర్ పిచాయ్‌.. ఏమ‌న్నారంటే..

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఏడాది కాలంలో కొత్తగా 37.9 మిలియన్ల వినియోగదారులు చేరినట్లు ముకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం 425 మిలియన్ల మందికి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏజీఎంలో ప్రకటించినట్లుగానే.. గూగుల్ భాగస్వామ్యంతో బడ్జెట్ ధరలో 4జీ ఫోన్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు ముకేశ్ అంబానీ. జియోఫోన్ నెక్ట్స్ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ 4జీ ఫోన్ విషయమై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా వర్చువల్గా మాట్లాడారు. ఇందులో కీలక విషయాలు వెల్లడించారు.

సేవే సంతృప్తి..

‘గూగుల్‌ క్లౌడ్‌, జియో మధ్య కుదిరిన 5జీ భాగస్వామ్యం దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్‌ అందిస్తుంది. ఇది వారి డిజిటల్‌ మార్పులు, వ్యాపారాలకు సహకరిస్తుంది. తర్వాతి తరం భారత్‌ డిజిటలైజేషన్‌కు పునాది వేస్తుంది. భారత్‌లో వ్యాపారాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే మా ఒప్పందం లక్ష్యం’ అని పేర్కొన్నారు. కరోనా దేశంలో విలయతాండవం చేసినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. గడిచిన ఏడాది కాలంలో అంచనాలకు మించి రాణించిందని ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అయితే, ఈ వృద్ధితో పోలిస్తే సంస్థ చేపట్టిన సహాయ కార్యక్రమాలే తనకు అత్యంత సంతృప్తినిచ్చాయని అన్నారు.