మండలి రద్దుకు కట్టుబడుందా ?

అధికార వైసీపీ శాసనమండలి రద్దుకు కట్టుబడుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మీడియాతో సజ్జల మాట్లాడుతు శాసనమండలి రద్దు చేస్తు గతంలో చేసిన తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమన్నారు. ఇదే సమయంలో మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు.

శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ శాసనమండలికి వచ్చేసరికి మైనారిటిలో ఉండేది. దీన్ని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశంపార్టీ తనిష్టారాజ్యంగా వ్యవహరించేది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన సీఆర్డీయే రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు లాంటి బిల్లులు మండలిలో వీగిపోయాయి. మండలిలో తనకున్న బలంతో టీడీపీ పై బిల్లులను అడ్డుకుంది. దాంతో ఏకంగా మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయించి ఆమోదం కోసం ఢిల్లీకి పంపారు.

అయితే మండలిరద్దు తీర్మానం ఢిల్లీకి చేరుకునే సమయానికి కరోనా వైరస్ తీవ్రత మొదలవ్వటంతో పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా జరగలేదు. దాంతో కేంద్రం కూడా చాలా బిల్లులతో పాటు ఈ బిల్లును కూడా పక్కన పెట్టేసింది. మండలి రద్దు జరగాలంటే పార్లమెంటు ఆమోదం అవసరం. కరోనా కారణంగా పూర్తిస్దాయి పార్లమెంటు సమావేశాలు జరగలేదు కాబట్టి మండలిరద్దు బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది.

ఇక తాజా విషయానికి వస్తే మండలిలో లెక్కల ప్రకారం టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరిగిపోయింది. దాంతో మండలి రద్దు అంశాన్ని టీడీపీ పదే పదే ప్రస్తావిస్తోంది. మండలిలో బలం ఉన్నంతకాలం రద్దు విషయాన్ని ప్రస్తావించని టీడీపీ, బలం తగ్గిపోయిన దగ్గర నుండి రద్దు విషయాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం.

ఇదే సమయంలో బిల్లులు పాస్ అవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదని వైసీపీ హ్యాపీగా ఉంది. బలం పెరిగిపోయిన తర్వాత మండలి రద్దు కావాలని వైసీపీ ఎందుకు అనుకుంటుంది. నిజంగానే మండలి రద్దు కావాలని టీడీపీ అనుకుంటే తమ సభ్యులతో రాజీనామా చేయిస్తే సరిపోతుందని వైసీపీ నేతలంటున్నారు. కాబట్టి మండలి రద్దయిపోవాలన్న టీడీపీ ఆశ నెరవేరే అవకాశాలు లేవు.