ఆ ప‌ట్టుద‌ల‌కు 550 రోజులు.. స‌పోర్ట్ చేయాల్సిందే!

ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 550 రోజులుగా సాగుతున్న ఉద్య‌మం. అది కూడా ఐదుకోట్ల మంది కోసం చేస్తున్న ఉద్య‌మం..మ‌రి దీనిలో మ‌న పాత్ర ఎంత‌? అనేది త‌ర‌చి చూసుకోవాలి..

అది క‌ల‌ల రాజ‌ధాని. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా వ‌ర్థిల్లాల్సిన రాజ‌ధాని. అయితే.. మారిన పాల‌కుడి కార‌ణంగా.. ఈ ప్ర‌భ స‌న్న‌గిల్లిపో యింది. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రం.. ఇప్పుడు క‌న్నీరు పెడుతోంది. అదే న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి. దీనిని నిల‌బెట్టుకునేందుకు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఇక్క‌డి రైతులు, మ‌హిళ‌లు.. చిన్నారులు వృద్ధులు ఉద్య‌మ బాట ప‌ట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 550 రోజులుగా అమ‌రావ‌తి ఉద్య‌మ పోరు న‌డుస్తోంది.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో ఊరూవాడా ఏకమై.. కనిపించిన ఏ అవ‌కాశాన్నీ వదులుకోకుండా.. రాజధాని కోసం గళమెత్తుతూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ ఆకాంక్షను వినిపిస్తూనే ఉన్నారు. లాఠీలు విరిగినా, నెత్తురోడినా, పోరాటపటిమను సడలనివ్వలేదు. అక్రమ కేసులు పెట్టినా, కరోనా ప్రాణ భయం వెంటాడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా సుదీర్ఘంగా వారు చేస్తున్న పోరాటం 550వ రోజులుగా సాగుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఏకం చేస్తూ.. అమ‌రావ‌తి జేఏసీ స‌హా అనేక ఉద్య‌మ సంఘాలు ఏర్ప‌డి.. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. వ‌స్తున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూసమీకరణలో భాగంగా ఇచ్చారు. వారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే. ప్రభుత్వం మారినా.. రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో.. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ఆలోచన శరాఘాతంలా మారింది. ఆ మర్నాటి నుంచే రాజధానిలో ఉద్యమం ఊపిరిలూదుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై… క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది.

రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి అధికార వైసీపీ తప్ప, మిగతా అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అప్ప‌టి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు, రైతు నాయకులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.

అయితే.. ఇప్ప‌టికీ రాజ‌ధాని ఉద్య‌మం ర‌గులుతూనే ఉంది. దీనికి ప్ర‌భుత్వ నేత‌లు.. అనుస‌రిస్తున్న వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కూడా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. రాజ‌ధాని మార్పు త‌థ్య‌మ‌ని.. ఏ క్ష‌ణంలో అయినా విశాఖ‌కు త‌ర‌లిపోతుంద‌ని.. ఎవ‌రూ దీనిని ఆప‌లేర‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో 550 రోజు ముగిసినా.. ఈ ఉద్య‌మం మ‌రింత తీవ్రంగా ముందుకు సాగేలా చూడాల‌ని ఉద్యమ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ.. రాజ‌ధాని ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో పిలుపునిస్తుండ‌డం గ‌మ‌నార్హం.