మోడీ సర్కారుకు ‘కొవీషీల్డ్’ తలనొప్పి

దేశీయ మీడియాలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా.. వారు ఇరుకున పడే కథనాలు పెద్దగా పబ్లిష్ కావటం లేదనే చెప్పాలి. ఈ కొరతను విదేశీ మీడియా సంస్థలు తీరుస్తున్నాయి. ఈ మధ్యన ఆదానీ షేర్లు దారుణంగా పడిపోవటానికి కారణం విదేశీ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని.. దేశీయంగా ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక పబ్లిష్ చేయటం.. దాంతో ఆదానీ షేరు విలువ ఎంతలా పడిందన్నది తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా రాయిటర్స్ సంస్థ ఒక సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య ఉన్న తేడాను రెట్టింపు చేసిన ఎపిసోడ్ బాధ్యత మొత్తం మోడీ సర్కారుదే తప్పించి.. ఆ నిర్ణయాన్ని తసీుకోవాల్సిన శాస్త్రీయ బృందం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి.. సదరు టీంలోని సభ్యుల చేత.. వారి వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ పబ్లిష్ చేసిన స్టోరీ ఇప్పుడు సంచలనంగా మారింది.

కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య తేడాను రెట్టింపు చేయాలన్న సూచన తాము చేయలేదని ప్రభుత్వం నియమించిన టీంలోని ముగ్గురు సభ్యులు (డాక్టర్ ఎండీ గుప్తే.. డాక్టర్ మాథ్యూ వర్ఘీస్.. డాక్టర్జేపీ ములియిల్) స్పష్టం చేశారు. వీరిలో ములియిల్ కొవిడ్ 19 వర్కింగ్ గ్రూపు సభ్యుడు కూడా. మొదట్లో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యత్యాసం నాలుగు వారాల నుంచి ఆరు వారాలుగా నిర్ణయించారు. ఆ తేడాను తర్వాతి కాలంలో 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మే 13న ప్రకటన చేసింది.

సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న ఆ సమయంలో.. వ్యాక్సిన్ కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్రం అలాంటి నిర్ణయాన్ని తీసుకుందన్న విమర్శలు వచ్చాయి. అయితే.. తాము తీసుకున్న నిర్ణయం వెనుక బ్రిటన్ లో వచ్చిన అధ్యయనాల ఆధారంగానే తీసుకున్నామని.. జాతీయ సాంకేతిక సలహా బృందం చేసిన సూచనతో డోసుల మధ్య తేడా పెంచినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. అలాంటి సిఫార్సులు ముగ్గురు సభ్యులున్న జాతీయ సాంకేతిక సలహా టీం చేయలేదని రాయిటర్స్ పేర్కొంది. ఈ కథనం సంచలనంగా మారి… మోడీ సర్కారుకు కొత్త తలనొప్పిగా మారటంతో కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఈ కథనాన్ని ఖండిస్తూ కొవిడ్ 19 వర్కింగ్ గ్రూపు అధిపతి ఎన్ కే అరోడాను రంగంలోకి దించారు. ఆయన డీడీ న్యూస్ (కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే) కు కఇంటర్వ్యూ ఇచ్చారు.

అందులో.. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య తేడాను పెంచటానికి ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ వారు వెల్లడించిన సమాచారంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే..కొవిషీల్ద్ టీకాల మధ్య దూరాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై నెలకొన్న వివాదం మరికొన్ని రోజులు సాగేట్లుగా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ మోడీ సర్కారుకు అంతో ఇంతో డ్యామేజ్ తప్పదన్న మాట వినిపిస్తోంది.