వైజాగ్‌లో రచ్చ రచ్చవుతున్న ‘కూల్చివేత’

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా కట్టే భవనాల కంటే కూల్చివేసిన నిర్మాణాలే ఎక్కువ అంటూ ప్రతిపక్షాలు, వ్యతిరేక వర్గాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఐతే ఎవరేమన్నా సరే ప్రజావేదికతో మొదలుపెడితే.. నిర్మాణాలను కూల్చుకుంటూనే వెళ్తోంది జగన్ ప్రభుత్వం.

ఐతే మిగతావి ప్రతిపక్షం నేతల మీద కోపంతో కూల్చివేశారు కాబట్టి చెల్లిపోయింది కానీ.. ఇప్పుడు విశాఖపట్నంలో 140 మంది మానసిక వికలాంగులు ఉంటున్న పాఠశాలను కూల్చివేయడంతో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేశారు అన్నది పక్కన పెడితే.. ప్రపంచం తెలియని మానసిక వికలాంగుల గూడును కూల్చివేయడంతో తీవ్ర విమర్శలు తప్పట్లేదు. కేవలం ప్రతిపక్షాల నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా ఈ విషయంలో వ్యతిరేకత తప్పట్లేదు.

వైజాగ్ సిటీ పరిధిలో జరిగిన ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా దీని పట్ల తీవ్ర నిరసన గళాలు వినిపిస్తున్నాయి. లీజు గడువు పూర్తయిందన్న కారణంతో అత్యవసరంగా అందులోని మానసిక వికలాంగులను బయటకు పంపించేసి జేసీబీలతో పాఠశాలను కూల్చేయడం అమానుషం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాఠశాలను కూల్చేయడంతో బయటికి వస్తున్న దివ్యాంగుల ఫొటోలు అందరినీ కలచి వేస్తున్నాయి. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఈ పాఠశాల కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు కనీసం సానుభూతి చూపించలేదని ఆ పిల్లల తల్లిదండ్రులు, నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పాఠశాల కూల్చివేత విషయమై ఒకప్పటి టీమ్ ఇండియా క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. ఈ పాఠశాల నేపథ్యం గురించి వివరిస్తూ ఆయనొక వీడియో కూడా రిలీజ్ చేశారు. హిడెన్ స్ప్రౌట్స్ పేరుతో 2013లో ఈ పాఠశాల నలుగురు విద్యార్థులతో మొదలైందని, ఇప్పుడు 140కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని.. ఈ పాఠశాలను నెలకొల్పిన శ్రీనివాస్‌ జీవితమంతా స్కూల్‌కే అంకితం చేశారని.. ఆయనకు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందని, ఇలాంటి వ్యక్తి కష్టాన్ని గుర్తించకుండా పాఠశాలను కూల్చేయడం బాధాకరమని, ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ఆయన కోరారు.