మోడీకి విజ‌న్ లేదు…ఉతికి ఆరేసిన ఆర్థిక నిపుణుడు

క‌రోనా క‌ల‌క‌లంలో ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి మ‌ళ్లీ అదే త‌ర‌హా కామెంట్లు ఎదుర‌య్యాయి. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారత్‌లో కరోనా సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్రంలోని రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఓ ఆంగ్ల న్యూస్‌ వెబ్‌ పోర్టల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రంపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. పేదలు, మధ్య తరగతి కొనుగోలు సామర్థ్యం దెబ్బతినడానికి, అప్పుల పాలవ్వడానికి కారణం వైరస్‌ సంక్షోభమేని రాజ‌న్ అన్నారు. అయితే, సంక్షోభం ఈ స్థాయిలో విస్తరించకుండా రాజకీయ నాయకత్వం చర్యలు చేపట్టలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా వ్యాప్తిని ‘వ్యాక్సిన్‌’ అడ్డుకోగలదని భారత ప్రభుత్వానికి ముందే తెలియదా? తెలుసు. కానీ ఏమీ చేయలేకపోయారు. అంటూ రాజ‌న్ సునిశితంగా విమ‌ర్శించారు. దేశీయంగా ఎంత తయారుచేసుకోగలం? విదేశాల నుంచి ఎంత తెప్పించుకోవాలి? ఇదేమీ కేంద్రం ఆలోచించలేదు అంటూ వ్యాఖ్యానించారు. దేశంలోని రాజకీయ నాయకత్వానిదే ముందుచూపు లేదు. ఒక విజన్‌ లేదు అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పాలనా అధికారాలు కేంద్రం తన చేతుల్లో పెట్టుకోవటం, నిపుణులను దూరం చేసుకోవటం.. వైఫల్యానికి దారితీసింది అని విశ్లేషించారు.

గతంతో పోల్చితే ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ స్థాయి పడిపోయిందని రాజ‌న్ అన్నారు. ప్రపంచ దేశాల్లో మన పరపతి పడిపోయింది. న్యాయ వ్యవస్థపైనా అనుమానాలు వెలువడుతున్నాయి. “ప్రజల గోప్యత ప్రమాదంలో పడింది. వర్సిటీల్లో వాక్‌ స్వాతంత్య్రాన్ని దెబ్బతీశారు. విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల్లో మళ్లీ నిలబడాలంటే అదంతా మారాలి. ప్రజాస్వామ్య లక్షణాలు, గోప్యతా హక్కు బలోపేతం, పటిష్ట న్యాయ వ్యవస్థ ద్వారా అది సాధ్యపడుతుంది.” అంటూ ప‌రోక్షంగా మోడీ ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌న్న భావ‌న వ్య‌క్తం చేశారు.

రెండో వేవ్‌ ఇంకా ముగియలేదని, దాని ప్రభావం ముందు ముందు తెలుస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ చెప్పారు. ధనికులు, ఎగువ మధ్య తరగతి వర్గాలపైనా రెండో వేవ్‌ ప్రభావమున్నట్టు తెలుస్తోందని అన్నారు. బాధాకరమైన విషయం ఏమంటే, ఈ సంక్షోభ సమయాన కూడా రాజకీయ నాయకత్వం తన బాధ్యత నిర్వర్తించటం లేదు.ప్ర‌స్తుతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే పేదలు, మధ్య తరగతిలో ఆత్మవిశ్వాసం నింపే చర్యలు చేపట్టాలని సూచించారు.