ప్రతిదానికి కేంద్రాన్నే నిందిస్తారెందుకన్న ప్రశ్నకు కేటీఆర్ రిప్లై ఇది!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరే నేత చేయని సాహసాన్ని తరచూ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విటర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ ప్రోగ్రాంను తరచూ నిర్వహిస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఇదే పని చేశారు. కేటీఆర్ నిర్వహించే ఆస్క్ కేటీఆర్ లో ఆయనకు సీరియస్ ప్రశ్నల్ని సంధించే వారు తక్కువగా కనిపిస్తారు.
సరదాగా కొందరు.. కొంటెగా మరికొందరు.. మొత్తంగా తన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని అందరిని ఆకర్షించేలా.. అలరించేలా చేయటంలో కేటీఆర్ తరచూ సక్సెస్ అవుతుంటారు.

అలాంటి ఆయనకు కాస్త భిన్నమైన అనుభవం ఎదురైంది. తాజాగా నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయనకు సీరియస్ ప్రశ్నలే ఎదురయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా అడగలేని కొన్ని ప్రశ్నల్ని ఎలాంటి మొహమాటం లేకుండా నెటిజన్లు అడిగేశారు. మీడియా అయితే.. ఇరిటేట్ అవుతారు కానీ.. నెటిజన్ మీద ఫైర్ అయితే సీన్ మరోలా మారుతుంది కాబట్టి.. సంయమనంతో సమాధానాలు చెప్పారు కేటీఆర్.

ఆయనకు ఎదురైన ప్రశ్నల్లో కీలకమైన ప్రశ్న ఏమంటే.. ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించకపోతే.. మీరే స్వయంగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసి.. ప్రజలకు అందించవచ్చు కదా? అని ఒక నెటిజన్ క్వశ్చన్ వేశారు.

దీనికి కేటీఆర్ బదులిస్తూ.. “మీకు నచ్చినా.. నచ్చకున్నా వాస్తవాల్ని చెబుతున్నా. వ్యాక్సిన్ లను నిల్వ చేసుకోవాల్సిన సమయంలో అప్రాధాన్యాలు.. సరైన సమయంలో వ్యాక్సిన్ లను ఆర్డర్ చేయకపోవటం.. విదేశాలకు ఎగుమతి చేయటం లాంటి తప్పుల్ని కేంద్రం చేసింది” అని పేర్కొన్నారు.

ఫైజర్.. జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీల్ని అనుమతించలేదన్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అనుమతులు ఇవ్వటంలోనూ ఆలస్యం చేశారని.. 2020 చివరర్లో భారత్ లో వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వాలని ఫైజర్ కోరితే.. జూన్ మొదటి వారంలో డీసీజీఐ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణలో ఫైజర్ టీకా ఎప్పుడు వస్తుందన్న ప్రశ్నకు.. ఆ విషయాన్ని కేంద్రాన్నే అడగాలన్నారు.