కేసీఆర్ ను ష‌ర్మిల ఒక రేంజ్‌లో..మాట‌ల్లో చెప్ప‌లేం

వైఎస్ ష‌ర్మిల‌… తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెల‌గాలని ప్ర‌య‌త్నిస్తున్న మ‌హిళా నేత‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న‌ను ఎండ‌గ‌డుతూ రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా సెకండ్ వేవ్ తో ఒకింత బ్రేక్ తీసుకున్నారు. అయితే, తిరిగి ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ ఇలాకాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్య‌క్తి కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డం నుంచి తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల దాకా.

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ గురించి తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో కేసీఆర్ స‌ర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..? ” అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

“తలాపున సముద్రమున్నా చాప దూపకు ఏడ్చినట్టు…. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి”. అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయ‌డం అందులో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన త‌రుణంలో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో మ‌రి.