కుప్పంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ… బాబు రియాక్ష‌న్ ఏంటో

తెలుగుదేశం పార్టీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అంటూ ప‌దే ప‌దే టీడీపీ నేత‌లు చెప్పుకొంటుంటారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మాట అంటే అదే ఫైన‌ల్ అని న‌డుచుకునే సంస్కృతి పార్టీలో ఉంద‌ని వివ‌రిస్తుంటారు. అయితే, అలాంటి పార్టీలో, అందులోనూ కుప్పంలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజక వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఎలా స్పందించ‌నున్నార‌నే ఉత్కంఠ స‌హ‌జంగానే నెల‌కొంది.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ జెండాను కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు ఎగరేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హ‌డావుడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు స‌హ‌జంగానే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో మారుతున్న ప‌రిణామాల‌కు నిద‌ర్శ‌న‌మా అనే టాక్ సైతం వినిపిస్తోంది.

కాగా, కుప్పంలో ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న ఇదే మొద‌టిసారి కాదు. ఇటీవ‌ల‌ చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న‌ ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున‌ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు చంద్రబాబును ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌యంలో చంద్రబాబు వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. అయితే, తాజాగా మ‌ళ్లీ అదే ప‌రిస్థితి కుప్పంలో జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కు కార‌ణంగా మారుతోంది.