అమూల్‌పై ఖ‌ర్చు పెట్టొద్దు.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు బ్రేకులు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఎంతో ఇష్టంగా.. మ‌రెంతో ప్రేమ‌గా రాష్ట్రంలో విస్త‌రిస్తున్న గుజ‌రాత్‌కు చెందిన పాల డెయిరీ సంస్థ ‘అమూల్’ విష‌యంలో హైకోర్టు బ్రేకులు వేసింది. అది కూడా అమూల్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విస్త‌రిస్తూ.. జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన శుక్ర‌వార‌మే.. హైకోర్టు ఈ డెయిరీ విష‌యంలో సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇదీ..

అమూల్‌ డెయిరీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమూల్‌, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. అదేస‌మయంలో అస‌లు.. ‘విజ‌య’ డెయిరీ ఉండ‌గా.. అమూల్‌ను తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏంట‌ని.. న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.

అయితే.. అమూల్‌కు సంబంధించి.. ప్ర‌భుత్వం స‌మ‌ర్ధించుకునేలా దాఖ‌లు చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్‌.. న్యాయ‌స్థానానికి చేర‌క‌పోవ‌డంతో కోర్టు.. ఈ విచార‌ణ‌ను వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు అమూల్ విస్త‌ర‌ణ‌, లేదా అమూల్ స్థాప‌న‌ల పేరుతో ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌రాదంటూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ ఈ రోజే.. అమూల్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విస్త‌రించారు.

సీఎం జ‌గ‌న్ వ్యూహం ఇదీ..

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అమూల్ ద్వారా పాల సేకరణను మరింత విస్తరించి, పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 2600 గ్రామాల్లో విస్తరిస్తామని, దశలవారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్ను విస్తరిస్తామని తెలిపారు. అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు. అమూల్కు పాలు పోయడం లాభదాయకమన్న సీఎం… పాడి రైతులకు లీటర్ కు 5 నుంచి 15 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు.

పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న సీఎం.. రాబోయే 2 సంవత్సరాల్లో అక్షరాల 4వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పాల నాణ్యత తెలుసుకునే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఇలాంటి ఖ‌ర్చుల‌కు ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.