విఫలమైన గ్లోబల్ టెండర్ల ప్రయత్నం

అందరికీ టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ విధానం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కోటి టీకాల కొనుగోలుకు ఏపి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ గడువు తేదీ గురువారంతో ముగిసింది. తాజా సమాచారం ప్రకారం కనీసం ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా టెండర్లో పాల్గొనలేదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ స్వయంగా చెప్పారు.

గ్లోబల్ టెండర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వటం మన దగ్గరే కాదు దాదాపు అన్నీ రాష్ట్రాలదీ ఇదే పరిస్ధితి. గ్లోబల్ టెండర్లకు మొదట వెళ్ళింది మహారాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ, ఒడిస్సా, కర్నాటక, తమిళనాడు, తెలంగాణా, ఏపి, గోవా, ఢిల్లీ కూడా గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అయితే ఏ రాష్ట్రానికి కూడా ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా టెండర్ దాఖలు చేయలేదు.

గ్లోబల్ టెండర్లు ఫెయిల్ అవ్వటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒకటిరెండు కంపెనీలతో నేరుగా చర్చలు జరిపింది. అయితే టీకాల సరఫరా విషయంలో తాము రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం లేదని స్పష్టంగా చెప్పేశాయి. తాము కేంద్రంతో మాత్రమే ఒప్పందాలు చేసుకుంటామని అక్కడి నుండి రాష్ట్రాలు టీకాలను తెప్పించుకోవాలని తేల్చి చెప్పాయి. దాంతో అంతర్జాతీయంగా ఏ కంపెనీ కూడా గ్లోబల్ టెండర్లలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు లేవని అర్ధమైపోయింది.

చాలా రాష్ట్రాలకు గ్లోబల్ టెండర్లకు టెండర్ దాఖలు తేదీ గురువారంతో ముగిసిన కారణంగా మళ్ళీ గడువును పొడిగించాయి. టెండర్లు దాఖలవుతాయనే నమ్మకం లేకపోయినా గడువను మరో రెండు వారాలు పెంచినట్లు సింఘాల్ చెప్పారు. గ్లోబల్ టెండర్ల ప్రయత్నం ఫెయిలైన కారణంగానే చాలా రాష్ట్రాలు టీకాల కోసం మళ్ళీ కేంద్రాలకు లేఖలు రాస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంపై ఒత్తిళ్ళు కూడా మొదలుపెట్టేశాయి. మరి టీకా ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాల్సిందే.