సూపర్ న్యూస్ – ఆగస్టు నాటికి రోజుకి కోటి వ్యాక్సిన్లు

కరోనా సెకండ్ వేవ్ విలయం భారతదేశంలో ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసింది. ఈ దశలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ లేకపోతే దీన్నుంచి మనం బయటపడటం కష్టం అని ఫిక్సయ్యాడు. ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. అయితే, మన దేశ జనాభాకు సరిపడా ఇక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవడం లేదు. అందుకే దాదాపు అన్ని వ్యాక్సిన్లకు ద్వారాలు తెరవక తప్పదు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈరోజు రష్యా నుంచి 3 మిలియన్ల వ్యాక్సిన్లు ఇండియాకు చేరుకున్నాయి. ఇది స్పుత్నిక్ వ్యాక్సిన్. మిగతా ఫైజర్, మోడెర్నాతో పాటు ఇతర వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఐసీఎంఆర్ ఛీఫ్ భార్గవ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఆగస్టు మొదటి వారానికల్లా మన దేశంలో ప్రతిరోజూ కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.

డిసెంబరు నాటికి … దాదాపు 108 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ వేస్తామని, మూడో వేవ్ అంచనాలు వేస్తున్న సమయం కంటే ముందే మొత్తం 130 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు భార్గవ. టీనేజర్లకు కూడా మలిదశలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. రెండేవేవ్ లో లాక్ డౌన్లు, కరోనా పరీక్షలతో బయటపడ్డాం… గాని ఇవంత మంచి మార్గాలేం కావు, వ్యాక్సినే అత్యుత్తమ మార్గం అని ఆయన స్పష్టం చేశారు.