చెంపదెబ్బ కొట్టిన కలెక్టర్.. వేటు పడింది

అధికారం ఉందని జులుం ప్రదర్శిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ఉదంతమే రుజువు. లాక్ డౌన్ వేళ రోడ్ల మీద తిరిగే జనాలను నియంత్రించే క్రమంలో అధికారులు, పోలీసులు కొన్నిసార్లు మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. సరైన కారణాలు లేకుండా చాలామంది బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మాట వాస్తవమే కానీ.. అదే సమయంలో అత్యవసర కారణాలతో బయటికి వచ్చే వాళ్లను పోలీసులు చితకబాదేస్తుండటం.. వాళ్లు చెప్పేది వినిపించుకోకుండా అమానుషంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కూడా చాలానే ఉంటున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ అయిన రణబీర్ శర్మ.. ఓ టీనేజీ కుర్రాడితో దారుణంగా వ్యవహరించడం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. ఆసుపత్రిలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం 13 ఏళ్ల కుర్రాడు బైక్ మీద ఫుడ్ తీసుకెళ్తుంటే రణబీర్ శర్మ, పోలీసులతో కలిసి అతణ్ని ఆపాడు.

ఐతే ఆ కుర్రాడు తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నట్లుగా ప్రిస్క్రిప్షన్ చూపించే ప్రయత్నం చేయగా.. దాన్ని చూసి కూడా కలెక్టర్ కనికరించలేదు. ఆ కుర్రాడి చెంప చెల్లుమనిపించాడు. అంతే కాక అతడి మొబైల్ తీసుకుని నేలకేసి కొట్టాడు. ఇంతలో పోలీసులు ఆ కుర్రాడి దగ్గరికి వచ్చి లాఠీలతో కొట్టారు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది కొన్ని గంటల్లో వైరల్ అయిపోయింది. కలెక్టర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. రణబీర్ శర్మ ఆరేళ్ల కిందట లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కేసులో ట్రాన్స్‌ఫర్ కావడం, ఆయనపై మరికొన్ని వివాదాలు ఉండటంతో అవన్నీ గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. వీడియో బాగా వైరల్ అయిపోవడం.. సోషల్ మీడియాలోనే కొందరు ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపడతామని చెప్పాల్సి వచ్చింది. రణబీర్ శర్మ రాత్రికల్లా ఒక వీడియో ద్వారా తన చర్యల పట్ల క్షమాపణ చెప్పాడు. జరిగిన సంఘటనపై కవర్ చేసుకునే ప్రయత్నమూ చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. ఒక రోజు గడిచేసరికి రణబీర్ మీద వేటు వేస్తూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.