విశాఖ ఉక్కుపై ఇక‌, మోడీదే నిర్ణ‌యం.. జ‌గ‌న్ తీర్మానం చేశారుగా…!

ఆంధ్రుల హ‌క్కు.. విశాఖ ఉక్కు- నినాదంతో ఏర్ప‌డిన విశాఖ ఉక్కును న‌ష్టాలు చూపిస్తూ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అందిన కాడికి అమ్మేసేందుకు రెడీ అయిన విష‌యం తెలిసిందే. దాదాపు 39 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైన ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తారా ? అంటూ.. విశాఖ స‌హా ఏపీ మొత్తం మోడీపై దండెత్తింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేంద్రం మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గిన సంద‌ర్భం లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తామ‌ని.. కేంద్ర మంత్రులు వ‌రుస పెట్టి మ‌రీ వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంటుకు కూడా చెప్పారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు రావ‌డం.. తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు, నాయ‌కులు.. కార్మికుల‌కు అండ‌గా నిలిచారు. అంతేకాదు.. వారి డిమాండ్‌ను ఢిల్లీ వ‌ర‌కు వినిపిస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. శార‌దా పీఠానికి వెళ్లిన స‌మ‌యంలో ఇక్క‌డి కార్మిక సంఘాలు.. విమానాశ్ర‌యంలో సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయి.. వారి స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో తార్మానం చేయాల‌ని కూడా డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌ను అమ‌లు చేయ‌డంతోపాటు కేంద్రానికి తాను లేఖ కూడా రాస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

అన్న‌ట్టుగానే కొన్నాళ్ల కింద‌టే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. న‌ష్టాల నుంచి ఎలా బ‌య‌ట ప‌డొచ్చో వివ‌రిస్తూ.. ప్ర‌ధానికి అనేక సూచ‌న‌లు సైతం చేశారు. ఇక‌, ఇంత‌లో దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌స్థాయిలో ఊపేసింది. దీంతో భారీ ఎత్తున ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి ఆక్సిజ‌న్ ను దేశ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేశారు. ఈ ప‌రిణామాల‌తో అయినా..కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ‌ను ప్రైవేటీక‌రించ‌కుండా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా ఒక్క‌రోజు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించిన‌.. వైసీపీ ప్ర‌భుత్వం.. బ‌డ్జెట్ను ఆమోదించింది. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామంతో.. జ‌గ‌న్ తాను ఇచ్చిన హామీని నెర‌వేర్చిన‌ట్టు అయింది. మ‌రి ఇక‌, మోడీ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.