ప్రధానిపై కిషన్ రెడ్డి కామెంట్.. అర్థం మారిపోయిందే


దేశంలో కరోనా ఉద్ధృతి రెండో దశలో ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ మీడియా దగ్గర్నుంచి సామాన్యుల వరకు అందరూ నిందిస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాలనే. కరోనా సెకండ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించినా మోడీ బృందం పెడచెవిన పెట్టిందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, ఎన్నికలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని.. ఫలితమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం అని అందరూ నిందిస్తున్నారు.

కరోనా విలయంపై ఇప్పటికీ ప్రధాని చలించట్లేదని.. తన అహాన్ని వీడట్లేదని.. అత్యవసర చర్యలు చేపట్టడం లేదని ఆయనపై సామాజిక మాధ్యమాల్లో గట్టి దాడే జరుగుతోంది. ఐతే ఈ వ్యతిరేక ప్రచారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో డ్యామేజ్ కంట్రోల్‌కు బీజేపీ అగ్ర నేతలు సిద్ధమయ్యారు. ఓవైపు బీజేపీ ఐటీ సెల్‌ను రంగంలోకి దించడంతో పాటు మంత్రులు వరుసగా మోడీకి మద్దతుగా ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో మోడీ గురించి నెగెటివ్ వార్తలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ది డెయిలీ గార్డియన్ పత్రిక భారత ప్రధాని గురించి రాసిన పాజిటివ్ స్టోరీని షేర్ చేస్తూ మంత్రులు ఒక టెంప్లేట్ ట్వీట్ వేశారు. ఆ మంత్రుల్లో మన కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. “Here is a prime minister who tries to work silently when a crisis comes and does not react to political statements since this is not the time to take the bull by the horns.” Don’t get trapped by the opposition’s false propaganda on PM Shri @narendramodi

ఇదీ కిషన్ రెడ్డి సహా కొందరు కేంద్ర మంత్రులు వేసిన టెంప్లేట్ ట్వీట్. ఐతే తొలి వాక్యంలో this is not the time to take the bull by the horns అంటూ ఒక ఇడియం వాడారు. ఐతే To take the bull by the horns.” అనే ఇంగ్లిష్ ఇడియంను ఎటువంటి క్లిష్టమైన నమస్య/పరిస్థితి ఎదురైనా, చలించక ధీరోదాత్తంగా ఎదుర్కొని ఆ పరిస్థితిని చక్కపరచటం అనే అర్థంలో వాడతారంటూ ఆంగ్ల అనువాదంపై పట్టున్న ఒక నెటిజన్ పేర్కొన్నారు. ఆ ప్రకారం చూస్తే ఈ ఇడియంను భిన్నమైన అర్థంలో వాడినట్లు అవుతుంది. దాని వల్ల ట్వీట్ అర్థమే మారిపోతుంది. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి ఎవరూ తీసుకెళ్లి కరెక్ట్ చేయించకపోవడం ఆశ్చర్యకరం.