జగన్ వ్యాఖ్య.. అంబులెన్స్ ట్యాంకర్ రాలేదట


బహిరంగ వేదికల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నపుడు కొన్నిసార్లు మాట తడబడటం సహజం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలా ఎక్కువగా తడబడుతుంటారు. మంచి వక్తలుగా పేరున్న వాళ్లకు కూడా ఇలాంటి తడబాట్లు తప్పవు. కానీ ఒక నాయకుడు కొన్నిసార్లు అలా తడబడ్డపుడు ఒక ముద్ర వేసి వ్యతిరేక ప్రచారం చేయడం చూస్తుంటాం. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే నారా లోకేష్ ఇలా టార్గెట్ అయిన వాళ్లే. వాళ్లు బహిరంగ వేదికల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడిన కొన్ని సందర్భాల్లో తడబడ్డారు. ఇంకేముంది ప్రత్యర్థులు అవి పట్టుకుని చెలరేగిపోయారు.

జాతీయ స్థాయిలో రాహుల్‌కు, మన దగ్గర లోకేష్‌కు ‘పప్పు’ అనే ముద్ర వేసేశారు. వాళ్లకు అసలు విషయ పరిజ్నానమే లేనట్లుగా ప్రొజెక్ట్ చేసి సామాజిక మాధ్యమాల్లో దారుణంగా ట్రోల్ చేసి వ్యక్తిత్వ హననం చేయడం తెలిసిందే.

ఐతే ఇలా ఏ పార్టీల వాళ్లు అయితే టార్గెట్ చేశారో.. అదే పార్టీల ముఖ్య నేతలు కూడా మీడియా ముందు, బహిరంగ వేదికల్లో మాట్లాడేటపుడు తడబడటం అందరూ చూశారు. ముఖ్యంగా లోకేష్‌ను టార్గెట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జగన్ తప్పులు కనిపించవు. ముఖ్యమంత్రి అయ్యాక గత రెండేళ్లలో జగన్ ప్రెస్ మీట్లలో పాల్గొనట్లేదు. మీడియా వాళ్లు లేకుండా ఆయనొక్కరే కూర్చుని చెప్పాలనుకున్న విషయం చెబుతున్నారు. మీడియా ప్రెజర్ లేకున్నా సరే.. గత ఏడాది కాలంలో జగన్ ఎన్నోసార్లు తడబడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొన్ని నిమిషాల వ్యవధిలో 11 మంది మృత్యువాత పడిన ఉదంతం గురించి జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషాదం గురించి వివరిస్తూ.. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంలో ఆలస్యం జరిగింది అనడానికి బదులు అంబులెన్స్ ట్యాంకర్ రావడంలో ఆలస్యం జరిగిందని జగన్ చెప్పడం గమనార్హం. ఇదే మాట నారా లోకేష్ అని ఉంటే వైకాపా వాళ్లు దాన్నెంత రచ్చ చేసేవారో అంచనా వేయొచ్చు. ఐతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్ వ్యాఖ్యల వీడియో పెట్టి ట్రోల్ చేస్తున్నారు.