ఆ పార్టీకి ఆవేశ‌మా త‌ప్పా… ఆలోచ‌న లేదా ?

రాజ‌కీయాల్లో ఆవేశం మాత్ర‌మే కాదు.. ఆలోచ‌న కూడా ఉండాల‌ని అంటారు.. అనుభ‌వ‌జ్ఞులు. కానీ, బీజేపీ విష‌యంలో ఎప్పుడూ కూడా ఆవేశ‌మే త‌ప్ప‌.. ఆలోచ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పార్టీ ప‌రిస్థితిని అంచనా వేసుకుని ముందుకు సాగాల్సిన నాయ‌కులు.. పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన నేత‌లు.. క‌ర్ర విడిచి సాము చేసుకున్న ఫ‌లితంగా .. ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక్క‌సారి.. మూడు మాసాల కింద‌ట‌కు వెళ్తే.. “రాబోయే రోజుల్లో పార్టీ డెవ‌ల‌ప్ అవుతుంద‌ని.. ఉద‌యించే సూర్యుడిని అడ్డుకోవ‌డం.. ఎవ‌రి వ‌ల్లా కాదు!” అనే కామెంట్లు వినిపించాయి.

దీంతో ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ కానీ.. మ‌రో పార్టీ కానీ.. త‌మ‌కు ప్రాధాన్యం లేద‌ని .. భావించిన నాయకులు.. త‌ట‌స్థ నేత‌లు కూడా త‌మ‌కు ప్ర‌త్యామ్నాయంగా.. ఒక‌ పార్టీ ల‌భించింద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు కీల‌క నేత‌ల‌తో మంత‌నాలు కూడా చేసుకున్నారు. ప‌ద‌వుల కోసం కూడా పాకులాడారు. జిల్లాల్లో త‌మ‌దే పైచేయి అయితే.. బాగుండు! అనే దిశ‌గా కూడా ఆలోచ‌న చేశారు. అయితే.. తిరుప‌తి ఉప ఎన్నిక రావ‌డంతో ఇలా.. త‌ట‌స్థులు.. ఇత‌ర పార్టీల్లోని అసంతృప్తుల‌తో నిండిపోతుంద‌ని ఊహించిన బీజేపీకి పెద్ద ప‌రీక్షే ఎదురైంది.

తిరుప‌తిలో రిజ‌ల్ట్ చూసుకుని.. పార్టీలో చేర‌దామ‌ని.. స‌ద‌రు కురువృద్ధులు, త‌ట‌స్థులు.. అసంతృప్తులు వంటివారు అనుకున్నారు. దీంతో సోము స‌హా చాలా మంది నాయ‌కులు తిరుప‌తి పోరు త‌ర్వాత‌.. పార్టీ కిక్కిరిసిపోతుంద‌ని.. పార్టీలో ఇంక నేత‌ల‌కు కొద‌వ ఉండ‌ద‌ని భావించారు. కానీ, ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుని.. తిరుప‌తిలో పార్టీ తిప్ప‌లు ప‌డింది. మాజీ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ లాంటి వారిని బ‌తిమిలాడి మ‌రీ పోటీ పెట్టినా కూడా పార్టీకి డిపాజిట్లు రాలేదు. పైగా అటు సాగ‌ర్లోనూ 6 వేల ఓట్ల‌కు మించి రాలేదు.

ఇక తిరుప‌తి ఫ‌లితం త‌ర్వాత‌.. అప్ప‌టి వ‌ర‌కు సోముకు ప‌క్క‌నే ఉన్న కొంద‌రు నేత‌లు కూడా ఇప్పుడు క‌నుమ‌రుగ‌య్యారు. ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆ పార్టీ వ‌ద్దులే అనే టాక్ కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ పుంజుకునేదెప్పుడు.. అధికారంలోకి వ‌చ్చేదెప్పుడు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ ఎన్నేళ్ల‌కు ల‌భిస్తుందో ? కూడా తెలియ‌ని దుస్థితి..!