ఏపీకి వెళ్లాలా.. మళ్లీ అది ఉండాల్సిందే

పోయినేడాది ఇదే సమయానికి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అటు వెళ్లలేక.. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని రోజులే ఉంటుందనుకున్న లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ఇరుక్కుపోయి స్వస్థలాలకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోగా.. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో మాత్రమే రాకపోకలు సాగించారు.

ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే వాహనాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. కర్నూలు, విజయవాడ బోర్డర్ల వద్ద వందలాదిగా వాహనాలు ఆగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ సమయంలోనే ఈ-పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. అందులో రిజిస్టర్ అయి ఈపాస్ పొందిన వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతులిచ్చారు.

కొన్ని నెలల తర్వాత ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ షరతులు తొలగిపోవడంతో ఈ-పాస్ అవసరం లేకపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ-పాస్‌ను అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఆరు గంటలు మినహాయించి లాక్ డౌన్ అమలవుతున్నట్లే అన్నమాట. ఈ నెల 18 వరకు ఈ షరతులు కొనసాగనున్నాయి. అప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు నేరుగా అనుమతులు ఉండవు.

ఏపీలోకి రావడానికి, ఇక్కడ ప్రయాణించడానికి కారణం వివరిస్తూ ముందస్తుగా అనుమతి పొంది.. ఈ-పాస్ చేతిలో పెట్టుకుంటే తప్ప వాహనాలకు అనుమతులు ఉండవు. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని నేపథ్యంలో ఈ నెల 18 తర్వాత కూడా కర్ఫ్యూను కొనసాగించడం, ఈ-పాస్ తప్పనిసరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవాళ్లు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం మరిచిపోరాదు.