నిజంగానే మోడికి జగన్ భయపడుతున్నాడా ?

దేశంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఎవరైనా ఒకనేత ఓ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే దాన్ని ఖండిస్తునో లేదా ఆ ఖండనలకు వ్యతిరేకంగానో వెంటనే ట్వీట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడింతా ఎందుకంటే నరేంద్రమోడి కేంద్రంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్-జగన్మోహన్ రెడ్డి-ఒడిస్సా ఎంపి సప్తగిరి ఉలాకా మధ్య జరుగుతున్న ట్వీట్లయుద్ధం మొదలైంది కాబట్టే.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపి, తెలంగాణా, జార్ఖండ్, ఒడిస్సా, పాండిచ్చేరి, జమ్మూ-కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో ముఖ్యమంత్రులతో ఫోన్ లో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మోడి తన మనసులోని మాటలను వివరించారు. నిజానికి సమావేశంలో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు లేవని సమాచారం. ఎందుకంటే కరోనా నియంత్రణపై సీఎంల అభిప్రాయాలకు మోడి పెద్దగా విలువివ్వలేదట.

ఇదే విషయమై హేమంత్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తన మనసులోని మాటను మాత్రమే చెప్పారని, దానికిబదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చేమాటలను వినుంటే బాగుండేదని సోరేన్ ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ కు జగన్ నుండి కౌంటర్ పడింది. మనమధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి సమయంలో రాజకీయాలు తగదంటు జగన్ ఖండించారు. విమర్శలకన్నా ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది అంటు జగన్ స్పష్టంచేశారు. వెంటనే జగన్ కౌంటర్ పై ఒడిస్సా కాంగ్రెస్ ఎంపి ఉలూకా నుండి గట్టిగా మరో కౌంటర్ వచ్చింది.

ఉలూకా మాట్లాడుతు ఈడీ, సీబీఐ కేసులకు జగన్ భయపడే మోడికి మద్దతుగా నిలబడ్డారా అంటు ఎద్దేవాచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ప్రధానితో లాలూచీపడ్డారా అంటూ అనుమానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడి కొడుకై ఉండి ఇలా లాలూచీపడటం తగదని హితవు పలికారు. మొత్తానికి ఈ ట్వీట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

నిజానికి మోడిపై జార్ఖండ్ సీఎం ట్వీట్ ను వ్యతిరేకించాల్సిన అవసరం జగన్ కు లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా మోడి-సోరేన్ కు మధ్య వ్యవహారం. సోరేన్ ట్వీట్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడిదే కానీ జగన్ కు ఎంతమాత్రం కాదు. అయినా స్పందించారంటే తెరవెనుక ఏమి జరిగిందో అర్ధం కావటంలేదు. నిజానికి వాళ్ళ వివాదంలో జోక్యం చేసుకునే వ్యక్తికూడా కాదు జగన్. అయినా జోక్యం చేసుకున్నారంటే కేంద్రం స్ధాయిలో ఎవరి కారణంగానో జగన్ ప్రధానికి మద్దతుగా నిలబడ్డారని తెలిసిపోతోంది. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఎంతదాకా వెళుతుందో చూడాలి.