కరోనా బారిన పడి జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు?

విపత్తు వచ్చినప్పుడు అత్యవసర శాఖకు చెందిన అధికారులకు రెట్టింపు పని ఉంటుంది. వారికి ప్రభుత్వ రక్షణ ఉంటుంది. కానీ.. జర్నలిస్టులకు అలాంటి పరిస్థితి ఉండదు. పనికి పని.. ఒత్తిడికి ఒత్తిడి ఉంటుంది కానీ.. జరగరానికి ఏదైనా జరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు ఎన్నో విపత్తులకు ఎదురొడ్డి పని చేసిన జర్నలిస్టులకు తొలిసారి కరోనా రూపంలో పెను ముప్పు పొంచి ఉంది.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. కరోనా సెకండ్ వేవ్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. సాధారణంగా పాత్రికేయ రంగంలో మరణాలు తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. జర్నలిస్టుల సగటు వయసు తక్కువగానే ఉంటుంది. ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన వారు చాలామంది పది.. పదిహేనేళ్లు చేసినంతనే వేరే రంగంలోకి వెళ్లిపోతారు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఈ రంగంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోకపోవటమే ఇందుకు కారణం.

అలా అని అందరూ ఉంటారని కాదు కానీ.. ఎక్కువమంది ఇదే ధోరణిలో ఉంటారు. ఈ కారణంగా పెద్ద వయస్కులు తక్కువగానే ఉంటారు. చాలావరకు యువకులు.. మధ్యవయస్కులే ఎక్కువ. సెకండ్ వేవ్ కవరేజ్ విషయమై యాజమన్యాలు కఠినంగా ఉండటం.. వారు పెట్టిన టార్గెట్లను అచీవ్ కావాలన్న మొండితనంతో వెనుకా ముందు చూసుకోకుండా పని చేస్తూ కరనా బారిన పడుతున్నారు.

ప్రింట్ మీడియా కొంతవరకు ఫర్లేదుకానీ.. ఎలక్ట్రానిక్ మీడియాలో విజువల్స్ కోసం.. బైట్ల కోసం కరోనా రోగులకు దగ్గరగా.. కరోనాకు మరింత దగ్గరగా వెళుతున్న వారు దాని బారిన పడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం.. తమకేం కాదన్న భరోసాతో కూడిన నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ఈ కారణంతోనే రోజుకు కనీసం ఒకరు.. గరిష్ఠంగా ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో కొత్త కలకలం రేగుతోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాజమాన్యాల తీరు మారకపోతే.. వారి వద్ద పని చేసే జర్నలిస్టులు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పని దుస్థితి.