వారిని వ‌ద‌ల్లేరు.. వీరిని న‌మ్మ‌లేరు.. టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి..!

టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌జాబలం ఉన్న నాయ‌కులు ప‌నిచేయ‌డం లేదు. ప్ర‌జ‌ల బ‌లం లేనివారు… ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. పోనీ.. వీరిని న‌మ్ముకుని చంద్ర‌బాబు ముందుకు న‌డిచే ప‌రిస్థితి ఉందా? అంటే.. అది కూడా లేదు. దీంతో పార్టీ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. నిత్యం మీడియాలో క‌నిపిస్తున్న మొహాల‌ను చూస్తే.. టీడీపీ త‌ర‌ఫున బాగా మాట్లాడుతున్నారు. మంచి మంచి కౌంట‌ర్లు ఇస్తున్నారు.. ప్ర‌భుత్వానికి ద‌డ పుట్టిస్తున్నారు.. అని అనిపిస్తుంది. నిజ‌మే వారు చేసే కామెంట్లు కూడా అలానే ఉంటున్నాయి.

ఇలాంటి వారిలో బుచ్చి రాంప్ర‌సాద్‌, వ‌ర్ల రామ‌య్య‌, కొమ్మారెడ్డి ప‌ట్టాభి రాం, పంచుమ‌ర్తి అనురాధ‌, అయ్య‌న్న పాత్రుడు (గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు), సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి (ఐదుసార్లు ఓట‌మి), పిల్లి మాణిక్యాల‌రావు.. ఇలా అనేక మంది క‌నిపిస్తారు. వీరికి మైక్ క‌నిపిస్తే.. చాలు.. ఛానెల్ ఏదైనా ఓకే.. అది రాష్ట్ర ఛానెలే అయి ఉండాల్సిన అవ‌స‌రం లేదు.. లోక‌ల్ మౌత్ అయినా స‌రే.. వీరి వాగ్ధాటిని ఆప‌డం ఎవ‌రిత‌ర‌మూ కాదు.. ఇక‌, మ‌రికొంద‌రు ఉన్నారు. వీరు మీడియా ముందుకు రాక‌పోయినా.. ఫేస్ బుక్ లైవులు, వాట్సాప్ లైవులు.. అంటూ.. స‌ర్కారుపై నిప్పులు చెరిగేస్తారు.

స‌ర్కారు త‌ప్పులు చేస్తోందంటూ.. చెరిగేస్తారు. ఇక‌, అనుకూల మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున క‌వ‌రేజీ వ‌స్తుంది. బ్యాన‌ర్ హెడ్డింగులు.. పెద్ద పెద్ద ఫొటోలు వ‌స్తాయి. దీంతో టీడీపీ వెలిగిపోతోంద‌ని .. చంద్ర‌బాబు స‌హా లోకేష్‌లు ఇత‌ర ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా భావిస్తున్నారు. కానీ.. వాస్త‌వానికి వీరికి ప్ర‌జా బ‌లం లేదు. వీరి మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కు న‌మ్ముతారో తెలియ‌దు. పైగా ఇలా .. మైకులు చించుకుంటున్న వారిలో చాలా మందికి క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టులేదు.

వీరు ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన నేత‌లు అంతా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య నిలిచింది లేదు.. నిలిచినా.. గెలిచింది కూడా లేదు. పోనీ పార్టీలో ప్ర‌జాబ‌లం ఉన్న‌వాళ్లు లేరా? అంటే.. ఉన్నారు. కానీ, వారికి మీడియా అంటే భ‌యం.. మైకు క‌నిపిస్తే.. త‌ప్పించేసుకుంటున్నారు. మ‌రి ఇలాంటి భిన్న‌మైన వ్య‌క్తులు, నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డం చంద్ర‌బాబుకు మ‌రింత క‌ష్టంగా మారింది. ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.