వైద్యం అందక హాహాకారాలు.. రోజుకొక పథకాల అమలుపై ప్రచారమా?

యావత్తు దేశం ఇప్పుడు కరోనా సంక్షోభంతో కిందా మీదా పడుతోంది. దీనికి ఏ రాష్ట్రం అతీతం కాదు. నిజానికి ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరన్నది చూసినప్పుడు.. అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన నిర్లక్ష్యానికి ప్రజలంతా మూల్యం చెల్లిస్తున్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ రోజున కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయి.. కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి. ఆసుపత్రుల్లో బెడ్లు.. ఆక్సిజన్.. రెమిడెసివర్ లాంటి వాటికి నెలకొన్న కొరత అంతా ఇంతా కాదు.

ఇలాంటివేళలో ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? కరోనా కాటు నుంచి తమ ప్రజల్ని తప్పించేందుకు మిగిలిన కార్యక్రమాల్ని పక్కన పెట్టేస్తుంది. ఫోకస్ అంతా కరోనా మీదనే పెడుతుంది. అవసరమైతే.. మిగిలిన పథకాల కింద పెట్టే ఖర్చును పక్కన పెట్టేసి.. ఆ నిధుల్ని సైతం వైద్య ఆరోగ్య అవసరాలకు వినియోగిస్తుంది. ఈ తీరుకు భిన్నంగా గడిచిన నాలుగైదు రోజుల్లో ఏపీలో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. అవాక్కు అవ్వాలి.

ఓపక్క ఏపీ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవటమే కాదు.. రోజు తిరిగేసరికి కనీసం పదివేల కేసుల నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యత మొత్తం ఆరోగ్యం మీదనే ఉంచుతుంది. అందుకు భిన్నంగా.. రోజుకో పథకానికి సంబంధించిన నగదునను లబ్థిదారుల ఖాతాల్లో వేస్తున్నట్లుగా భారీ ప్రకటనలు ఇచ్చుకోవటం ఏపీ లోని జగన్ సర్కారుకు సాధ్యమేమో? ఈ రోజున వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని విజయవంతంగా రెండో ఏడాది అమలు చేస్తున్నట్లుగా పేర్కొంటూ భారీ జాకెట్ యాడ్ ఇవ్వటం గమనార్హం.

ఓపక్క ఏపీ మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్ పెట్టి.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా ఆ రెండు పత్రికలు దారుణమైన రీతిలో రాతలు రాస్తున్నట్లుగా మండిపడ్డారు. ఆ రెండు పత్రికల్లో ఒకదానికి తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని ఫోటోలతో.. రంగు రంగుల బాక్సుల్ని కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తే.. ఈ తరహా పాలన జగన్ కు మాత్రం సాధ్యమేమో? ఓపక్క వైద్యం అందక రాష్ట్ర ప్రజలు విలవిలాడితే.. దాని గురించి పట్టించుకోవాల్సింది పోయి.. ప్రకటనల హడావుడిలోనూ.. పథకాల అమలు గొప్పలకు పోవటం దేనికి నిదర్శనం?