భూమన ఇమేజీకి మైనస్సేనా ?

లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజికి బాగా మైనస్ అవుతోంది. అసలే 2019 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీలో వైసీపీకి మైనస్ అయ్యింది. ఎంఎల్ఏగా భూమన 700 ఓట్లతో గెలిస్తే పార్లమెంటుకు వచ్చేసరికి దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు 3వేల చిల్లర ఓట్లు మైనస్ అయ్యాయి. ఈ కారణంగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర భూమనకు మైనస్ అయ్యింది.

అప్పటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే తనకు బదులుగా భూమన కొడుకు అభినయ్ రెడ్డిని పిక్చర్లోకి తీసుకొచ్చారు. నిజానికి భూమనకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పాజిటివ్ ఇమేజిలేదు. ఏదో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గాలిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మొదటిసారి గెలిచారు. తాజాగా జగన్ గాలిలో రెండోసారి గెలిచారు. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఒకసారి, వైసీపీ అభ్యర్ధిగా మరోసారి ఓడిపోయారు. అంటే ఏదైనా గాలుంటే మాత్రమే భూమన గెలుస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలో ఆరు అసెంబ్లీల్లో మంచి మెజారిటి వస్తే ఒక్క తిరుపతిలో మాత్రమే వైసీపీకి మైనస్ వచ్చింది. తాజా ఎన్నికలో కూడా మిగిలిన 6 నియోజకవర్గాల్లో సగటున 68 శాతం పోలింగ్ నమోదైతే తిరుపతిలో మాత్రం 50 శాతమే నమోదైంది. ఇక్కడే భూమన ఎలక్షనీరింగ్ పై అనుమానాలు పెరిగిపోయాయి. భూమన సరిగా పనిచేయకపోవటం వల్లే ఓటింగ్ బాగా తగ్గిపోయిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

దీనికి అదనంగా దొంగ ఓట్ల గోల పెరిగిపోతోంది. ప్రతిపక్షాలు గోల చేస్తున్నట్లుగా వేలల్లో దొంగ ఓట్లు పడలేదన్నది నిజం. అయితే ఎన్నోకొన్ని పడ్డాయన్నదీ వాస్తవమే. నిజానికి దొంగ ఓట్లు వేసుకోవటం అన్నది ఇప్పుడే మొదలుకాలేదు. ఏదేమైనా ఓటింగ్ బాగా తగ్గిపోవటం, దానికి దొంగ ఓట్లు గోల తోడవ్వటంతో స్ధానిక ఎంఎల్ఏగా భూమన ఇమేజీ డ్యామేజి అయ్యిందన్న చర్చ పెరిగిపోతోంది.