బెంగాల్ పాలిటిక్స్ సంచ‌ల‌నం.. మ‌మ‌త నేత‌లు.. బీజేపీ ఏజెంట్లా?!

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ద‌శల‌వారీ పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. మ‌రో నాలుగు ద‌శ‌లు ఉన్నాయి. అయితే.. తొలి మూడు ద‌శ‌లు పూర్త‌య్యే వ‌ర‌కు బాగానే ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. నాలుగో ద‌శ నుంచి మారుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి న‌మ్మిన‌బంట్లుగా ఉన్న‌వారు.. మ‌మ‌త‌కు కుడి భుజాలుగా ఉన్న‌వారు.. ఆ పార్టీలోనే ఉంటూ.. బీజేపీకి కోవ‌ర్టులుగా మారుతున్నారా? అనేసందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నారు. మారుతున్న ప‌రిస్థితులు… ప‌రిణామాలు.. వీటిని నిజ‌మేన‌ని అనిపించేలా ఉండ‌డం రాజ‌కీయాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీ యాంశంగా మారుతున్నాయి.

నాలుగోద‌శ ఎన్నిక‌ల స‌మ‌యానికి.. మ‌మ‌త‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా, వ్యూహ క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ యూట‌ర్న్ తీసుకున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ముస్లిం సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న.. మ‌మ‌త‌కు ముస్లింలు దూరంగా ఉన్నార‌ని.. చేసిన వ్యాఖ్య‌ల వీడియో హ‌ల్ చ‌ల్ చేసింది. దీనిని బీజేపీ నేత‌లే బ‌య‌టపెట్ట‌డం మ‌రో చిత్రం. దీంతో.. ఆ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ ప‌రిణామం.. త‌ర్వాత‌.. కూడా పీకే ఎక్క‌డా ఆగ‌లేదు. మోడీని ప్ర‌జానాయకుడు అంటూ సంబోధించారు.

ఈ ప‌రిస్థితి కూడా మ‌మ‌త‌కు తీవ్ర శ‌రాఘాతంగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ రెండు ప‌రిణామాల‌ను బీజేపీ భారీ ఎత్తున త‌న ప్ర‌చారానికి అనుకూలంగా మార్చుకుంది. ఇక‌, తాజాగా మ‌మ‌త‌కు కుడి భుజం అనే.. మ‌హిళా నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్ సుజాతా మండ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు .. ఐదో ద‌శ ఎన్నిక‌ల ముంగిట‌.. మ‌మ‌త‌కు మ‌రింత మంట పెడుతున్నాయి. “ద‌ళితులు బిచ్చ‌గాళ్ల కంటే ఘోరంగా త‌యార‌య్యారు. ప్ర‌భుత్వం ఇస్తున్న పింఛ‌న్లు తీసుకుంటూ.. బీజేపీ ఇస్తున్న డ‌బ్బులు కూడా తీసుకుంటున్నారు” అని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకుని మూడు చోట్ల నిర్వ‌హించిన‌.. ప్ర‌చారంలో మ‌మ‌త ‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇక్క‌డ మ‌రో.. చిత్ర‌మైన ఘ‌ట‌న ఏంటంటే.. ఐదో ద‌శ ఎన్నిక‌లు.. ఎస్సీలు, ద‌ళితులు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌రుగుతున్నాయి. అక్క‌డ ప్ర‌చారం చేసిన మోడీ .. సుజాతా మండ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌మ‌త‌కు ఆపాదిస్తూ.. తృణ‌మూల్ ప‌రువు తీసేశారు. ఈ ప్ర‌భావం ఐదో ద‌శ ఎన్నిక‌ల‌పై తీవ్రంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌మ‌త పెట్టుకున్న ఆశ‌లు ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌ట్టికొట్టుకుపోయాయ‌ని అంటున్నారు. మొత్తానికి అటు పీకే, ఇటు సుజాత మండ‌ల్ కూడా బీజేపీ వ్య‌తిరేక‌మే అయినా.. బీజేపీ వేస్తున్న వ‌ల‌లో చిక్కుకుని.. ఆ పార్టీకి కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించేస్తున్నారా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మ‌రో నాలుగు ద‌శ‌లు మిగిలి ఉన్న ఎన్నిక‌ల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి ఉంటుందో!!