‘సాగ‌ర్’ పోరులో కేసీఆర్‌కు తొలి ఎదురుదెబ్బ‌.. ఏం జ‌రిగిందంటే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి తొలి ఎదురు దెబ్బ త‌గిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. దాదాపు ల‌క్ష‌ మంది తో ఈ స‌భ నిర్వ‌హించేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌నలు కూడా ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో భౌతిక దూరం పాటించాల‌ని.. మాస్కులు ధ‌రించాల‌ని.. చెబుతున్న ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల‌పై జ‌రిమానా కొర‌డా ఝ‌ళిపిస్తున్న స‌ర్కారు..లక్ష మందితో స‌భ ఎలా నిర్వ‌హిస్తుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

అంతేకాదు.. అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని హాలియా రైతుల హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని, కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దంటున్న ప్రభుత్వం.. లక్ష మందితో సభ ఎలా పెడుతారని పిటిషన్‌లో పేర్కొన్న రైతులు. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ సభను రద్దుచేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ కోరారు. అటు రైతులు, ఇటు స్వచ్ఛంద సంస్థల పిటిషన్లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రో రెండు రోజుల్లోనే స‌భ ఉండ‌డం ఇప్పుడు ఇలా వ్య‌తిరేక‌త రావ‌డం కేసీఆర్‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణమించింది.

ఇక‌, ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కూడా కేసీఆర్‌కు ఇబ్బంది పెడుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఎలాంటి వ్య‌తిరేక‌తా రాలేదు. కానీ, ఇప్పుడు సాగ‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలా వ్య‌తిరేక‌త రావ‌డం అంటే.. ఇది ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిందా? లేక ప్ర‌తిప‌క్షాలు ఉద్దేశ పూర్వంగానే చేస్తున్నాయా? అనే చ‌ర్చ తెలంగాణ భ‌వ‌న్‌లో జోరుగా వినిపిస్తోంది. ఇది ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌తే అయితే.. సాగ‌ర్ స‌మ‌రం .. ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ప్ర‌తిప‌క్షాలు క‌నుక ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడితే.. దీనికి అంతే దీటుగా స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఏదేమైనా.. సాగ‌ర్‌లో కేసీఆర్ స‌భ‌కు తొలి అడుగులో నే ఇంత వ్య‌తిరేక‌త రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.