రాజ‌మండ్రిలో సీన్ రివ‌ర్స్‌… వైసీపీ టు టీడీపీ…!

ఏపీలో రాజ‌కీయం ఎంత వ‌న్‌సైడ్‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ ఎన్నిక జ‌రిగినా అధికార వైసీపీ తిరుగులేని విజ‌యం సాధిస్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏకంగా 90 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక 11 కార్పోరేష‌న్ల‌లో ఒక్క‌టంటే ఒక్క చోట కూడా టీడీపీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. 75 మున్సిపాల్టీల్లో ఒక్క తాడిప‌త్రి మిన‌హా ఎక్క‌డా టీడీపీ విజ‌యం సాధించ‌లేదు. ఆ పార్టీకి మూడు ద‌శాబ్దాలుగా కంచుకోట‌లుగా ఉంటూ వ‌స్తోన్న మున్సిపాల్టీలు సైతం వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి.

ఇక త్వ‌ర‌లో జ‌రిగే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లే కాదు.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ వైసీపీ గెలుపు విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. తిరుప‌తిలో అయితే వైసీపీ ఏకంగా 3-4 ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తామ‌ని స‌వాళ్లు రువ్వుతోంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మారిపోయారు. టీడీపీతో పాటు ఇత‌ర పార్టీల నుంచి అధికార వైసీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మాత్రం రివ‌ర్స్ జంపింగ్‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమహేంద్ర‌వ‌రంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ ప్ర‌భంజనం త‌ట్టుకుని మ‌రీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ, రూర‌ల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లోనే ఇక్క‌డ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీని పటిష్ట ప‌రుస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వైసీపీలో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను టీడీపీలో చేర్చుకుంటున్నారు. తాజాగా భ‌వానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ స‌మ‌క్షంలో 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారంతా రాజమండ్రి నగరంలోని 14, 15వ వార్డులకు చెందినవారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కార్పోరేష‌న్‌ను వ‌రుస‌గా టీడీపీ మూడుసార్లు గెలుచుకుంది.