కేసీయార్, జగన్ కు అంత ధైర్యముందా ?

నరేంద్రమోడి విదానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చేతులు కలపాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ లేఖలు రాశారు. దేశంలోని కొందరు ముఖ్యమంత్రులకు, కొన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలకు కూడా మమత లేఖలు రాశారు. తన లేఖలో మోడి ప్రభుత్వ విధానాలను, ప్రజాస్వామ్యాన్ని హరించేస్తున్న పద్దతులపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి మోడి విదానాలు చేస్తున్న నష్టం గురించి వివరంగానే చెప్పారు.

అంతా బాగానే ఉందికానీ దీదీ రాసిన లేఖకు ఎంతమంది స్పందిస్తారనేదే డౌటు. మిగిలిన వాళ్ళసంగతిని పక్కన పెట్టేసినా కేసీయార్, జగన్మోహన్ రెడ్డి మమతకు మద్దతుగా నిలబడతారా అన్నదే ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం బాహుబలంత బలంగా ఉంది. అంతటి బలమైన ప్రభుత్వంతో పోరాడేందుకు ఎవరు సాహసిస్తారు అనేదే ప్రశ్న. పైగా మమత లేఖలను అందుకున్న ముఖ్యమంత్రులు కానీ లేదా ప్రతిపక్ష నేతలు కానీ బహిరంగంగా మోడిని వ్యతిరేకించిన వారుకాదు.

ముఖ్యమంత్రుల్లో ఇప్పటివరకు ఎవరు కూడా మోడిని సవాలు చేసిన వాళ్ళులేరు. మొదటినుండి మోడితో పడని కారణంగానే మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో తనను ఓడించటమే లక్షంగా పెట్టుకున్నారు కాబట్టే మోడితో మమత పెద్ద యుద్ధమే చేస్తున్నారు. రేపు గెలిచినా ఇద్దరి మధ్య బహుశా ఇదే విధమైన వాతావరణం కంటిన్యు అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టే అవుటురైటుగా మోడిపై మమత యుద్ధాన్ని ప్రకటించేశారు.

అయితే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మమత పరిస్దితి లేదు. తెలంగాణా, ఏపి, ఒడిస్సాలో బీజేపీకి బలమే లేదు. కాబట్టి పై ముఖ్యమంత్రులకు కమలంపార్టీతో వచ్చిన నష్టమేమీలేదు. వాళ్ళ ఉనికికే సమస్య వస్తే అప్పుడు వాళ్ళు కూడా మమత బాటలోనే నడుస్తారేమో తెలీదు. ఇక డీఎంకే చీఫ్ స్టాలిన్ కు లేఖ రాశారంటే ఆయన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.

అలాగే బీహార్లో తేజస్వీ యాదవ్ కు కూడా లేఖ రాశారు. తేజస్వి ఎలాగు మోడి వ్యతిరేక స్టాండే తీసుకున్నారు కాబట్టి కచ్చితంగా మమతకు మద్దతుగా నిలుస్తారు. ఫైనల్ గా ఏపి విషయానికి వస్తే తనపై కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణ జరుగుతోంది కాబట్టి మోడికి వ్యతిరేకంగా మమతతో చేతులు కలిపేంత ధైర్యం జగన్ చేస్తాడని ఎవరు అనుకోవటంలేదు. కేసీయార్ అంటే ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో ఆయనకే తెలీదు. కాబట్టి హోలు మొత్తం మీద చూస్తే మమతకు మద్దతు వచ్చే అవకాశాలైతే తక్కువనే అనిపిస్తోంది.