టీడీపీలో సీనియ‌ర్ల దుమారం.. కీల‌క స‌మ‌యంలో సీన్ రివ‌ర్స్ ?

తీవ్ర ఇర‌కాటంలో ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఏ విధంగా ముందుకు న‌డిపించాల‌నే విష‌యంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు ఒక‌వైపు ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రోవైపు సీనియ‌ర్లు త‌మ దారిలో తాము న‌డుస్తున్నారు. త‌మ ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కొంద‌రు నాయ‌కులు పార్టీకి ఇప్ప‌టికీ దూరంగానే ఉన్నారు. మ‌రికొంద‌రు ఇప్పుడున్న నాయ‌క‌త్వం మారాల‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట కుప్పంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. పార్టీ నాయ‌క‌త్వాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అప్ప‌గించాల‌ని అక్క‌డ డిమాండ్ వ‌చ్చింది.

అయితే.. ఇది ఎమోష‌న‌ల్ విష‌యం కావ‌డంతో పెద్ద‌గా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు టీడీపీ 40 వ వార్షికోత్సవ వేళ పార్టీలోని సీనియ‌ర్లు కూడా అదే మాట చెబుతుండ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. తాజాగా పార్టీ ఆవిర్భావ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించారు. దీనివ‌ల్ల పార్టీలో కొత్త ఊపు వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. అయితే.. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపించింది. తెలుగుదేశంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పారు. గ్రౌండ్ రియాల్టీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు.. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల్సిన సీనియ‌ర్లు .. ఇలా రోడ్డున ప‌డి ఎవ‌రో వ‌స్తారు..ఏదో చేస్తారు..అని ఎదురు చూడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుందా ? ఇప్పుడున్న నాయ‌క‌త్వాన్ని త‌క్కువ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌రైందేనా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సీనియ‌ర్లు ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ పాటిస్తే.. మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.