సానుభూతిపైనే కేసీయార్ ఆశలు ?

అవును నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కొడుక్కి టికెట్ ఇవ్వటంతోనే ఈ విషయం అందరికీ అర్దమైపోయింది. నోముల కొడుకు నోముల భగత్ కు కేసీయార్ పార్టీ కార్యాలయంలో బీఫారమ్ అందించారు. దాంతో సాగర్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ సానుభూతి రాజకీయాలకే కట్టుబడినట్లుగా అర్ధమైపోయింది. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో కూడా కేసీయార్ దివంగత ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే అప్పట్లో సానుభూతి ఓట్లతో పార్టీ చాలా ఈజీగా గెలిచేస్తుందని కేసీయార్ తో పాటు నేతలంతా ఎన్నికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. దాని ఫలితమే ఊహించని డిఫీట్. గెలుపు విషయమై చివరలో టీఆర్ఎస్ అగ్రనేతలకు అనుమానం వచ్చింది. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అందుకనే సానుభూతి కూడా పనిచేయలేదు. నిజానికి కేసీయార్ జాగ్రత్తగా ఉండుంటే చాలా ఈజీగా గెలవాల్సిన సీటు దుబ్బాక.

సరే అప్పుడు అయ్యిందేదో అయిపోయిందన్న ఉద్దేశ్యంతో దుబ్బాక రిజల్టు మరీ రిపీట్ కావద్దని నేతలకు చెప్పి మరీ కేసీయార్ వారసునికే టికెట్ ఇచ్చారు. సాగర్ నియోజకవర్గంలో యాదవులు పవర్ ఫుల్ అనే చెప్పాలి. అందుకనే నోముల గెలిచారు. అంతమాత్రాన రెడ్లను తేలిగ్గా తీసేసేందుకు లేదు. మొదటినుండి ఇక్కడ రెడ్లదే ఆధిపత్యం. అందుకనే కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు.

మొత్తానికి కేసీయార్ వ్యూహం ప్రకారం సాగర్ ఉపఎన్నికలో రెడ్డి-యాదవ్ ఫైట్ చాలా గట్టిగానే జరిగేట్లుంది. అయితే దుబ్బాకలో దివంగత ఎంఎల్ఏ భార్య లాగ నోముల భగత్ అమాయకుడు కాదట. తండ్రి మంచి జోరుమీదున్నపుడు తండ్రి తరపున భగతే నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టేవారట. పైగా బీఇ+ఎంబిఏ లాంటి డిగ్రీలు చాలానే ఉన్నాయి. అంతకుమించి రాజకీయాలు కొత్తేమీకావు. కాబట్టి ఉపఎన్నికలో గట్టి ఫైటే జరిగేట్లుంది చూస్తుంటే. మొత్తానికి సానుభూతి పనిచేస్తే కేసీయార్ వ్యూహం సక్సెస్ అయినట్లే.