తిరుపతి ఉప ఎన్నిక వేళ.. కేసీఆర్ ను ఫాలో అయిన జగన్


పంచాయితీ ఎన్నికలు తమకు పూర్తి పాజిటివ్ గా మారి.. పురపోరులో అదరగొట్టే ఫలితాల్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ అధికారపక్షం మాంచి జోష్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్న అనుమానాలు.. సందేహాలన్ని ఉత్తవేనని తేలిపోవటమే కాదు.. తమ ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ కావటంపై అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తన కొత్త కోరికను ఆయన బయటపెట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన ఆయన..తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా చేయాలన్న అభిలాషనను వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంత్రి ఇంచార్జ్ గా ఉంటారని.. ఒక ఎమ్మెల్యే అదనంగా పని చేస్తారని చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం.. ప్రజాబలం తమకు ఉందన్న విషయాన్ని తాజా ఎన్నికతో మరోసారి రుజువు చేయాలన్నారు. అభ్యర్థి గురుమూర్తిని మంచి మెజార్టీతో తెలిపించాలని కోరారు. ప్రతి ఓటర్ కు జరిగిన మంచిని గుర్తు చేసి.. వారి దీవెనలు.. ఆశీస్సులు కావాలని కోరమని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే మెజార్టీ ఒక మెసేజ్ లా ఉండి.. అందరూ ఈ ఫలితం గురించి మాట్లాడేలా ఉండాలని చెప్పటం గమనార్హం.

తాజాగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని చూస్తే.. ఇటీవల జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దివంగత పర్ధాని పీవీ కుమార్తెను అభ్యర్థిగా బరిలోకిదింపిన వేళలో.. పార్టీకి చెందిన పలువురు నేతల్ని తన ఇంటికి పిలిచిన సీఎం కేసీఆర్.. ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరించారు. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన భేటీని చూస్తే.. తిరుపతి ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాన్ని పాలో అయినట్లుగా కనిపించక మానదు.