ఇంత వేవ్ ఉన్నా తిరుపతిపై వైసీపీలో ఆందోళ‌న ఎందుకు ?

ఏపీలో ఇప్పుడున్న గాలిలో ఏ ఎన్నిక జ‌రిగినా గెలుపు మాత్రం ప‌క్కా వైసీపీదే అని చెప్ప‌క త‌ప్ప‌దు. మొన్న పంచాయ‌తీలు, కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల ఎన్నిక‌లు చూశాక వైసీపీ ప్ర‌భంజ‌నం అడ్డుకోవ‌డం ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం కాద‌న్న నిర్ణ‌యానికి అంద‌రూ వ‌చ్చేశారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ మామూలు బ‌లంగా లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌రిష‌త్ ఎన్నిక‌లు, తిరుప‌తి ఉప ఎన్నిక‌పైనే ఉంది. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ప‌రువు మ‌రింత పాతాళానికి పోవ‌డానికా ? అన్న‌ట్టు ఇప్పుడు మ‌ళ్లీ తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చేసింది. బీజేపీది కూడా అదే ప‌రిస్థితి. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఈ రెండు పార్టీల త‌ర‌పున పోటీ చేసేందుకు కూడా స‌రైన అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయి ప‌రువు పోగొట్టుకున్న టీడీపీ తిరుప‌తిలో ఖ‌చ్చితంగా గెల‌వ‌దు. ఈ విష‌యం టీడీపీకి తెలుసు. ఇటు గెలుపు విష‌యంలో వైసీపీకి డోకా లేదు. అయినా వైసీపీలోనే టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. దీనికి చాలా కార‌ణాలే ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ప‌న‌బాక‌పై ఏకంగా 2.27 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక వైసీపీ అభ్య‌ర్థిగా జ‌గ‌న్ ఫిజియో థెర‌పిస్ట్ డాక్ట‌ర్ గురుమూర్తికి టిక్కెట్ కేటాయించారు. చాలా మంది సీనియ‌ర్లు ఈ టిక్కెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఎస్సీ వ‌ర్గంలో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ల‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇస్తార‌ని అనుకున్నా.. జ‌గ‌న్ మాత్రం రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త అయిన గురుమూర్తికి సీటు ఇచ్చారు. దీనిపై పార్టీలోనే చాలా మందిలో అసంతృప్తి ఉంది.

ఇక తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో అధికార పార్టీలోనే అనేక గ్రూపులు ఉన్నాయి. మంత్రి అనిల్‌, మాజీ మంత్రి ఆనం, కాకాణ గోవ‌ర్థ‌న్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, ఆదిమూలం ఇలా చాలా మంది నేత‌ల మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఇక నెల్లూరు జిల్లాలో గ్రూపుల గోల‌కు లెక్కేలేదు. అటు కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే మ‌ధుకు మంత్రి పెద్దిరెడ్డితో పొస‌గ‌డం లేదు. వీరంద‌రిని స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇప్పుడు పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిలో చాలా మందిని జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడు ఉప ఎన్నిక‌ల వేళ వీళ్ల త‌మ త‌డాఖా చూపిస్తామ‌ని స‌వాళ్లు రువ్వుతున్నారు. మ‌ధుసూద‌న్ రెడ్డి, ఆనం, కాకాణి ఈ ఎన్నిక‌ల ప‌ట్ల విముఖంగా ఉన్నార‌ట‌.

ఇవ‌న్నీ ఇలా ఉంటే వైసీపీ ప్ర‌స్తుత స్వింగ్‌ను కంటిన్యూ చేయాల‌నుకుంటే క‌నీసం 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కూ మెజార్టీ సాధించాలి. ఇక గ‌త ఎన్నిక‌ల మెజార్టీ వ‌చ్చినా.. మెజార్టీ 2 ల‌క్ష‌ల కంటే త‌గ్గినా అదిగో వైసీపీ ప‌నైపోయింద‌ని ప్ర‌చారం చేసేందుకు టీడీపీ మాత్ర‌మే కాదు… అటు బీజేపీ కూడా కాచుకుని కూర్చొని ఉన్నాయి. ఇక జ‌గ‌న్ ఈ ఎన్నిక బాధ్య‌త అంతా మంత్రి పెద్దిరెడ్డి చేతుల్లోనే పెట్టేయ‌నున్నారు. అది కూడా చాలా మంది నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. మ‌రి ఈ స‌వాళ్లే ఇప్పుడు వైసీపీని టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి. వీటిని ఎదుర్కొని 3 లక్ష‌ల మెజార్టీని ఎంత వ‌ర‌కు సాధిస్తుందో ? చూడాలి.