ఖమ్మం తర్వాత షర్మిల టార్గెట్ ఏ జిల్లా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన షర్మిల రాజకీయ ప్రయాణం.. ఆద్యంతం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఒక అడుగు తర్వాత మరో అడుగు అన్నట్లుగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతల్ని ఆకర్షించే కన్నా.. తెలంగాణలోని వివిధ వర్గాల మద్దతు తనకుందున్న విషయాన్ని రోజువారీ నిర్వహించే కార్యక్రమాలతో ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు బోలెడంత సమయం ఉండటం.. తన రాజకీయాన్ని భారీ హైప్ తీసుకొచ్చే కన్నా.. మెట్టు తర్వాత మెట్టు అన్నట్లుగా సాగుతోంది.

ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించే భారీ సభ ద్వారా తాను పెట్టనున్న రాజకీయ పార్టీ పేరును.. జెండా.. ఎజెండాను సిద్ధం చేస్తున్న ఆమె.. తర్వాత ఏం చేస్తారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా తర్వాత ఆమె ఫోకస్ పెట్టే జిల్లా ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె.. తన తదుపరి ఫోకస్ పెట్టేది మహబూబ్ నగర్ జిల్లా మీదనే అని చెబుతున్నారు.

దీనికి రెండు కారణాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో.. ఆ జిల్లాలో పార్టీ బలాన్ని పెంచుకోవటం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. తన రాజకీయ రంగ ప్రవేశం పై చాలామంది నేతలు మౌనంగా ఉంటే.. అందుకు భిన్నంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిలో రేవంత్ ఉన్నారు. ఆయన జిల్లాల పార్టీని బలోపేతం చేయటం ద్వారా లెక్క తేల్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఖమ్మం తర్వాత మహబూబ్ నగర్ అని.. ఆ తర్వాత నల్గొండ మీద ఆమె ఫోకస్ ఉంటుందని.. తర్వాత రంగారెడ్డి.. హైదరాబాద్ మీదనే ద్రష్టి పెడతారని చెబుతున్నారు. అదిలాబాద్.. నిజామాబాద్.. కరీంనగర్.. వరంగల్ జాల్లాల మీద కాస్త ఆలస్యంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు.