భైంసాపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు

వేసే ప్రతి అడుగు అత్యంత వ్యూహాత్మకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వైఎస్ షర్మిల.. మరోసారి తన ప్రత్యేకతను చాటారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయం మొదలు.. ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయటమే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆమె.. ఊహించని విధంగా స్పందించిన ఉదంతం తెలంగాణ సర్కారును ఇరుకున పడేలా చేసిందని చెప్పాలి. భైంసా అల్లర్ల నడుమ పెద్దగా ఫోకస్ కాని ఒక దారుణ ఉదంతాన్ని టైమ్లీగా తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల.

నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ లైంగిద దాడిపై ఆమె గళం విప్పారు. ఇప్పటివరకు ఈ అంశాన్ని బీజేపీ మాత్రమే ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతోంది. నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతుందని బీజేపీ నేతలు.. సానుభూతి పరులు ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు పెద్దగా స్పందించింది లేదు.

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల. నాలుగేళ్ల బాలికపై జరిగిన దాడి అమానుషమన్న ఆమె.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. భైంసా ఉదంతం గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేశాయని చెప్పక తప్పదు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. తాజాగా ఈ అంశంపై రియాక్టు కావటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత సీరియస్ వ్యాఖ్యలు చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.