గుంటూరు టీడీపీకి ఏమైంది.. యోధానుయోధులే ముంచేశారా ?

ఇప్పుడు ఇదే మాట‌.. ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ఘోరంగా చ‌తికిల ప‌డింది. క‌నుసైగ‌ల‌తో శాసించ‌గ‌ల నాయ‌కులు, తాము త‌ప్ప‌.. గుంటూరులో టీడీపీని బ‌తికించేవారు ఎవ‌రూ లేర‌న్న నాయ‌కులు ఉన్న చోట‌.. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ పూర్తిగా ప‌ట్టాలు త‌ప్పేసింది. అంతేకాదు, నాయ‌కుల హ‌వా ఇంతేనా.. ఇక‌, పార్టీ ప‌రిస్థితి గోవిందా! అనే రేంజ్‌కు ప‌డిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు కార్పొరేష‌న్ స‌హా.. మాచ‌ర్ల‌, పిడుగురాళ్ల‌, తెనాలి, స‌త్తెన‌ప‌ల్లి, చిల‌క‌లూరిపేట, రేప‌ల్లెల‌లోని కీల‌క మునిసిపాలిటీల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. ఇత‌ర జిల్లాల‌కు… గుంటూరుకు టీడీపీ విష‌యంలో చాలా ప్ర‌త్యేక‌త ఉంది.

ముఖ్య‌మైన నాయ‌కులు, ఫైర్ బ్రాండ్లు ఎక్కువ‌గా ఉన్నది ఈ జిల్లాలోనే. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీని ముందుండి న‌డిపించిన నాయ‌కులు చాలా మంది ఉన్న జిల్లా కూడా ఇదే. క‌మ్మ సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఎక్కువుగా ఉన్న‌ది కూడా ఈ జిల్లాలోనే. గ‌త ప్ర‌భుత్వంలోనే ఈ జిల్లా నుంచి ఏకంగా 10 మంది క‌మ్మ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి చోట‌… టీడీపీ చ‌తికిల ప‌డ‌డం అంటే.. ఆషామాషీ విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జిల్లా పార్టీ మాజీ ఇంచార్జ్, ప్ర‌స్తుత న‌రాసారావుపేట పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షులు జీవీ ఆంజ‌నేయులు.. వినుకొండ నుంచి 2009, 2014లో విజ‌యం సాధించారు. ప‌ల్నాడులో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుకూడా ఉంది. అయితే.. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తా చూపించ‌లేక పోయారు. ఇక‌, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబులు నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారును టార్గెట్ చేసిన వారే.

ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి సెంటిమెంటును భుజానేసుకుని రాజ‌కీయాలు చేసిన వారే. అయితే.. తీరా యుద్ధం మొద‌ల‌య్యే స‌రికి మాత్రం.. ప‌త్తా లేకుండా పోయారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్ల పులిగా ప్ర‌చారం చేసుకుంటారు. కానీ.. ఇప్పుడు పిల్లి మాదిరిగా మారిపోయార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఒకింత ప్ర‌య‌త్నించినా.. ఇత‌ర నేత‌లు ఆయ‌న‌కు క‌లిసి రాని ఫ‌లితంగా ఇక్క‌డ కూడా టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. వాస్త‌వానికి వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు.. ఎన్నిక‌ల‌కు ముందుగానే స‌వాళ్ల రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

ఇక్క‌డ ఏక‌గ్రీవాలు పోను.. క‌నీసం ఐదు వార్డుల్లో కూడా టీడీపీ గెల‌వ‌ద‌ని బొల్లా స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. ఇక్క‌డ టీడీపీ గెలిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జీవీలో జ్వాల ర‌గ‌ల‌లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జీవీ.. ఇప్పుడు చ‌తికిల‌ప‌డ‌డం ఎలాంటి సంకేతాలు పంపిస్తోందో అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లిలోనూ టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక్క‌డ పార్టీని నిల‌బెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దివంగ‌త స్పీక‌ర్ కోడెల కుమారుడు.. ఇక్క‌డ అన‌ధికార ఇంచార్జ్‌గా టీడీపీని నడిపిస్తున్నారు. అయితే.. ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇటు వైపు రాలేదు. ఫ‌లితంగా వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి హ‌వా.. పెరిగిపోయింది.

తెనాలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్ర‌సాద్.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు నిత్యం మీడియా మీటింగులు పెట్టి.. వైసీపీపై దుమ్మెత్తి పోశారు. వారానికి రెండు సార్లు అమరావ‌తి అంశాన్ని రాజ‌కీయంగా వాడుకున్నారు. కానీ, తాజా ఎన్నిక‌ల్లో ఎక్క‌డా ఆయ‌న ఊసు లేకుండా పోయింది. అదేవిధంగా నక్కా ఆనంద బాబు ప‌రిస్థితి కూడా ఘోరంగా త‌యారైంది. ఇక‌, వ‌రుస విజ‌యాల‌తో హోరెత్తించి.. గుంటూరులో కీల‌క నేత‌గా ఎదిగిన మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా అచేత‌నంగా ఉండిపోయారు. ర‌జ‌నీ జోరు ముందు ఆయ‌న బేజారు అయ్యారు.

ఫ‌లితంగా కీల‌క‌మైన గుంటూరులో వైసీపీ హ‌వా ముందు టీడీపీ నిల‌వ‌లేక పోయింది. మ‌రి వీరంతా.. రెండేళ్ల కింద‌టి వ‌ర‌కు గుంటూరులో చ‌క్రం తిప్పిన నాయ‌కులే..తమ‌కు ఎదురు లేద‌ని కామెంట్లు చేసిన నేత‌లే. కానీ.. ఇప్పుడు వీరికి ఏమైంది? ఏదేమైనా.. ఈ విష‌యాన్ని తేల్చాల్సిన అవ‌స‌రం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబు ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.