తాడిప‌త్రిపై ఆప‌రేష‌న్ జ‌గ‌న్‌.. మ‌కాం వేసిన కీల‌క మంత్రి!

స్థానిక ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భంజ‌నం క‌నిపించింది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా వైసీపీ దూకుడుగా ముందుకు సాగ‌డం కావొచ్చు.. ప్ర‌త్య‌ర్థులు కేసుల భ‌యంతో వెన‌క్కి త‌గ్గ‌డ‌మే కావొచ్చు.. మొత్తానికి మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో వైసీపీ పాగా వేసింది. అయితే.. ఇంత దూకుడు చూపించినా.. జోరు విజ‌యం సాధించినా.. వైసీపీలో మాత్రం అసంతృప్తి క‌నిపిస్తోంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రెండు మునిసిపాలిటీలు త‌మకు ద‌క్క‌క పోవ‌డ‌మే! అవి రెండూ కూడా టీడీపీ నేత‌ల‌కు ద‌క్క‌డ‌మే!! అందునా.. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌పై ఒంటికాలిపై లేస్తున్న జేసీ కుటుంబానికి ఒక‌టి మ‌ద్ద‌తుగా మార‌డాన్ని వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిపాలిటీ వైసీపీకి ద‌క్క‌లేదు. కానీ, జిల్లా మొత్తం ఓడిపోయి.. ఇదొక్క‌టి మాత్రం సాధించా ల‌ని.. జేసీ వ‌ర్గాన్ని తుక్కుకింద ఓడించాల‌ని.. మ‌రీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జేసీ దివాక‌ర్ రెడ్డి పోటీ చేసిన 24వ డివిజ‌న్‌లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని ఆది నుంచి కూడా ఎంపీ త‌లారి రంగ‌య్య‌, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు తీవ్రంగా శ్ర‌మించారు. అయితే.. జేసీ వ‌ర్గం నుంచి సేవ్ తాడిప‌త్రి నినాదాన్ని తెర‌మీదికి తెచ్చి.. సెంటిమెంటును ర‌గిలించింది. దీంతో అనూహ్యంగా తాడిప‌త్రిలో వైసీపీకి మెజారిటీ ద‌క్క‌లేదు. ఇక్క‌డ మొత్తం 36 డివిజ‌న్లు ఉన్నాయి. వీటిలో వైసీపీ 2 ఏక‌గ్రీవం చేసుకుంది.

దీంతో 34 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీడీపీ జేసీ వ‌ర్గం 18 డివిజ‌న్లు సంపాయించుకుంది. ఇక‌, వైసీపీ 14కు ప‌రిమిత మైంది. ఇక‌, టీడీపీ మ‌ద్ద‌తు పార్టీ సీపీఐ అభ్య‌ర్థి ఒక వార్డులోను, స్వ‌తంత్ర అభ్య‌ర్థి మ‌రో వార్డులోను విజ‌యం సాధించారు. దీంతో ఎవ‌రు మెజారిటీ సాధించాల‌న్నా.. తాడిప‌త్రి మునిసిపాలిటీని కైవ‌సం చేసుకోవాల‌న్నా.. 20 మంది అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. టీడీపీకి సీపీఐ, స్వ‌తంత్ర అభ్య‌ర్థి మ‌ద్ద‌తుతో 20 మంది మెజారిటీ ఉంది. కానీ, జేసీపై ఉన్న వ్య‌క్తిగ‌త రాజ‌కీయ క‌క్ష‌ల నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీ పాగా వేసేందుకు కుటిల య‌త్నాలు ప్రారంభించింద‌ని.. ఈ వ‌ర్గం ఆరోపిస్తోంది.

ఈ క్ర‌మంలో ఇక్క‌డే మ‌కాం వేసిన రాయ‌ల‌సీమ‌కు చెందిన కీల‌క మంత్రి ఒక‌రు.. చ‌క్రం తిప్పుతున్నార‌ని.. సామ‌, దాన, భేద దండోపాయాలు వినియోగిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. 21, 22, 23 డివిజ‌న్ల అభ్య‌ర్థుల‌కు స్థానికం గా షాపింగ్ కాంప్లెక్సులు, వ్యాపారాలు ఉండ‌డంతో వీరిని టార్గెట్ చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రో వైపు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్ అఫిషియో ఓట్ల‌ను కూడా వైసీపీ వినియోగిస్తోంది. అదేస‌మ‌యంలో టీడీపీకి ఉన్న ఎక్స్ అఫిషియో స‌భ్యులు.. ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి విష‌యంలో మాత్రం న్యాయ వివాదాలు సృష్టించింది. దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఈ నెల 18 లోపు ఎట్టి ప‌రిస్థితిలోనూ టీడీపీ అభ్య‌ర్థుల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలను ప్ర‌తి ఒక్క‌రూ విమ‌ర్శిస్తున్నారు.