ఇప్పుడు కూడా ప్రజలదే తప్పట

తెలుగుదేశంపార్టీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కొద్ది రోజులు చంద్రబాబునాయుడుతో పాటు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఓట్లేయించుకున్నారని, ఒక్క చాన్సని బతిమలాడుకుంట జనాలు మోసపోయి ఓట్లేశారని..ఇలా అర్ధంలేని మాటలు చాలా మాట్లాడారు. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి వైసీపీకి ఓట్లేసినందుకు జనాలనే శాపనార్ధాలు పెట్టారు.

సరే ఏదో ఓటమి బాధతో ఏదో మాట్లాడారులే అని అందరు సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతా అలాగే మాట్లాడుతున్నారు. అంటే తమ్ముళ్ళ ఆలోచన, మాటతీరులో ఏమాత్రం మార్పు రాలేదని అర్ధమైపోతోంది. జగన్ రూపంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉన్నాడని అంగీకరించటానికి చంద్రబాబు అండ్ కో ఏమాత్రం ఇష్టపడటం లేదు.

పార్టీ సినియర్ నేతలు వర్ల రామయ్య, దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. వర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతు అత్యంత బలమైన క్యాడర్ బలమున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం అంటే ప్రజలకే నష్టమన్నారు. టీడీపీకి ఇంత ఘోరమైన ఓటమి ఎదురవ్వటం పట్ల జనాలు సీరియస్ గా ఆలోచించాలన్నారు. టీడీపీ ఓడిపోతే ఆలోచించుకోవాల్సింది ఆ పార్టీ నేతలే కానీ జనాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటిది పార్టీ ఓడిపోతే జనాలు ఎందుకు ఆలోచించాలి ? ఇలాంటి మాటలు మాట్లాడే జనాల్లో పలుచనైపోయారు తమ్ముళ్ళు. ఇక దీపక్ మాట్లాడుతూ జనాలకు మూడు ప్రశ్నలంటూ మొదటుపెట్టారు. వైసీపీది వెన్నుపోటు రాజకీయమన్నారు. వైసీపీ వెన్నుపోటుతో ఎన్నికల్లో గెలిచిందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వెన్నుపోటు రాజకీయాలంటే ఎవరు గుర్తుకొస్తారో అందరికీ తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల్లో జనాలు వైసీపీకి అఖండ గెలుపును ఎందుకు ఇచ్చారనే విషయంలో విశ్లేషించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజాయితి విశ్లేషణలు మానేసి వైసీపీది వెన్నుపోటు గెలుపని చెప్పటమే విచిత్రంగా ఉంది. వైసీపీ గెలుపును అంగీకరించకుండా బురద చల్లుతున్నంత కాలం టీడీపీకి ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయి.