విడ‌ద‌ల ర‌జ‌నీ మార్క్ ట్విస్ట్‌… మ‌రిదికి మునిసిప‌ల్ చైర్మ‌న్ ?

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ నుంచి… వైసీపీలోకి రావడం.. రాజ‌కీయ గురువు పుల్లారావుపై గెల‌వ‌డం.. ఆ త‌ర్వాత సొంత పార్టీ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తో వార్ ఇవ‌న్నీ ఆమెను రాజ‌కీయంగా రాష్ట్ర స్థాయిలో హైలెట్ చేశాయి. అన్నింటికి మించి ఆమె సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉన్నారు. ఈ వ‌రుస సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో ఆమె రాజ‌కీయంగా మ‌రో సంచ‌ల‌నానికి కేంద్ర బిందువు అవుతున్నార‌న్న చ‌ర్చ తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో జరుగుతోంది.

చిల‌క‌లూరిపేట మున్సిపాల్టీకి ఈ నెల 10న ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల‌కు ముందు రోజు హైకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో ఆఘ‌మేఘాల మీద అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎన్నిక‌లు ఎదుర్కొన్నాయి. గ‌తేడాది మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డినప్పుడు జ‌న‌ర‌ల్ అయిన చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని ర‌జ‌నీ వైసీపీ నుంచి వైశ్య వ‌ర్గానికి చెందిన ఓ నేత‌కు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. స‌ద‌రు నేత క‌రోనా టైంలోనే కాకుండా.. ఆ త‌ర్వాత కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు విస్తృతంగా ఖ‌ర్చు చేశారు.

పేట‌లో ప‌బ్లిక్ టాక్ కూడా వైసీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా స‌ద‌రు వైశ్య వ‌ర్గానికి చెందిన నేతే అని వ‌చ్చింది.ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గానికి చెందిన ఎవ్వ‌రికి కౌన్సెల‌ర్ సీట్లు ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే పేట‌లో టాక్ మారిపోయింది. వైసీపీ నుంచి ర‌జ‌నీ మ‌రిది అయిన విడ‌ద‌ల గోపీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్నారు. ర‌జ‌నీ స్వ‌గ్రామం అయిన పురుషోత్త‌ప‌ట్నంలో వారి సొంత వార్డు నుంచి గోపీ వైసీపీ కౌన్సెల‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు.

అక్క‌డ గోపీ గెలుపు కోసం ల‌క్ష‌ల రూపాయ‌ల క‌ట్ట‌లు తెగాయంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే గోపీ దూకుడుగా ఉండ‌డంతో పాటు ర‌జ‌నీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్ర‌మంలోనే గోపీ కౌన్సెల‌ర్‌గా పోటీ చేయ‌డానికి ముందు త‌న వ‌దిన అయిన ఎమ్మెల్యే ర‌జ‌నీ నుంచి చైర్మ‌న్ ప‌ద‌విపై హామీ వ‌చ్చాకే రంగంలోకి దిగిన‌ట్టు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక టీడీపీ పాల‌న‌లో ర‌జ‌నీ మామ‌కు కౌన్సెల‌ర్ ప‌ద‌వితో పాటు ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

ఇప్పుడు ర‌జ‌నీ ఎమ్మెల్యేగా ఉంటే మళ్లీ ఆయ‌న మ‌రిదిని మునిసిప‌ల్ చైర్మ‌న్‌ను చేస్తే పేట‌లో అంతా కుటుంబ పాల‌న అవుతుంద‌ని ఇప్ప‌టికే మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్ల‌రావు సైతం విమ‌ర్శ‌లు చేశారు. మ‌రోవైపు ర‌జ‌నీ ప‌ట్ట‌ణంలో మెజార్టీగా ఉన్న క‌మ్మ‌, వైశ్య వ‌ర్గాల‌ను కాద‌ని త‌మ సొంత కుటుంబానికే చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టుకుంటే ర‌జ‌నీ మ‌ళ్లీ సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు కాక త‌ప్ప‌దు. అటు మెజార్టీ సామాజిక వ‌ర్గాల్లో సైతం ఆమెకు వ్య‌తిరేక‌త త‌ప్ప‌దు.