తండ్రి, కొడుకుల దారులు వేరయ్యాయా ?

ఇదే విషయంలో చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఒకపుడు ఏ చిన్న విషయం మీదైనా కానీండి కేంద్రప్రభుత్వంపై ఒంటికాలిపై లేచేవారు కేసీయార్. అలాంటిది గడచిన కొంత కాలంగా కేంద్రంపై పెద్దగా మాట్లాడటం లేదు. కేంద్రంపై యుద్ధమే అని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమేందంటు ఆమధ్య వరకు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కేసీయార్ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడి, అమిత్ షా తో రెండుసార్లు భేటి అయ్యారు. మరి ఆ భేటిలో ఏమయ్యిందో ఏమో అప్పటి నుండి కేంద్రానికి వ్యతిరేకంగా నోరిప్పటం లేదు. పైగా అప్పుడెప్పుడో కేంద్రప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ను అమలు చేసేది లేదని ఖండితంగా చెప్పిన కీసీయార్ విచిత్రంగా ఢిల్లీ నుండి తిరిగిరాగానే అమల్లోకి తెచ్చేశారు.

సరే ఇఫుడు ప్రస్తుతానికి వస్తే కేంద్ర విధానాలపై కేసీయార్ కొడుకు, మంత్రి కేటీయార్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై స్టీల్ ప్లాంటులోని ఉద్యోగులు, కార్మికులు గడచిన నెలన్నరరోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు.

ఇదే విషయమై తాజాగా కేటీయార్ మాట్లాడుతు విశాఖ స్టీల్ ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ఈరోజు విశాఖ స్టీల్స్ ను ప్రైవేటీకరించిన కేంద్రం రేపటి రోజున తెలంగాణాలోని హెచ్సీఎల్, ఇసీఐఎల్, సింగరేణి సంస్ధలను కూడా ప్రైవేటుపరం చేయరని గ్యారెంటి ఏమటని మండిపడుతున్నారు. ఆ పరిస్ధితి తెలంగాణాకు ఎదురు కాకూడదనే ముందుజాగ్రత్తగా విశాఖ స్టీల్ ఉద్యమానికి తెలంగాణా తరపున మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు.

సరే కేసీయార్ తో మాట్లాడకుండానే కేటీయార్ విశాఖ స్టీల్స్ విషయంలో కేంద్రంపై మాట్లాడరని తెలిసిందే. అయితే హఠాత్తుగా విశాఖ స్టీల్స్ ఆందోళనలపై కేటీయార్ కు ఎందుకింత ప్రేమ వచ్చేసిందన్నదే అనుమానంగా ఉంది. తెలంగాణాలో జరుగుతున్న ఎంఎల్సీ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్ల కోసమే కేటీయార్ నాటకాలు ఆడుతున్నట్లు బీజేపీ ఆరోపణలు కురిపిస్తోంది లేండి. నాలుగు రోజులు ఆగితే తెలీదా కేటీయార్ ప్రేమ దేనిపైనో ?