టీడీపీ-వైసీపీల‌ను డ‌మ్మీ చేయ‌డ‌మే: ఏపీపై బీజేపీ పెద్దల రాజ‌కీయ‌ వ్యూహం ఏంటి?

తాను ఎద‌గాలి… అనుకున్న చోట‌.. బీజేపీ అనుస‌రించే వ్యూహం ఏంటి? ఏ రాష్ట్రంలో అయినా.. త‌న‌కు ప‌ట్టు చిక్కాలి.. అంటే.. చేస్తున్న ప‌నేంటి? కొద్దిగా లోతుగా చూస్తే.. అక్క‌డ ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డం… లేదా.. ఆయా పార్టీల‌ను డ‌మ్మీలు చేసేయ‌డం! ఇదే పంథాను బీజేపీ పెద్ద‌లు అనుస‌రిస్తున్నారు. త‌మిళనాడులో అధికార పార్టీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకున్నార‌నే విమ‌ర్శలు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ పాగా వేయాల‌ని బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. వ‌చ్చే 2024 ఎన్నిక‌లు.. లేదా. దీనికి ముందు వ‌చ్చే జ‌మిలిలో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే త‌మ‌కు అందివ‌చ్చే పార్టీల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించి. అధికార వైసీపీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకున్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే.. వైసీపీ విష‌యంలో బీజేపీ పెద్ద‌గా న‌మ్మ‌కంగా లేదు. ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మకు వైసీపీ సాయం చేస్తుంద‌నే ఆశ‌లు బీజేపీలో క‌నిపించ‌డం లేదు. పోనీ.. టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. స్థానిక బీజేపీ నేత‌ల్లో కొంద‌రు.. టీడీపీతో జ‌ట్టుకు రెడీగానే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం పెద్ద‌లు మాత్రం టీడీపీకి చేరువ కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. పైగా ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో అంతో ఇంతో బ‌లంగా ఉన్న టీడీపీని… అధికార పార్టీగా ఉన్న వైసీపీని డ‌మ్మీలు చేస్తే.. ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని నిల‌బెట్టొచ్చ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తొంది.

ఈ క్ర‌మంలోనే ఏపీలో ఇటు అధికార పార్టీని, అటు ప్ర‌తిపక్షంగా ఉన్న టీడీపీని ప్ర‌జ‌ల్లో డ‌మ్మీ పార్టీలు అనే ముద్ర వేసేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని ఇరుకున పెట్టిన బీజేపీ.. ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయేలా చేసింద‌నే వాద‌న ఉంది. హోదా విష‌యం.. టీడీపీకి భారీ ఎదురుదెబ్బ‌గా మారింది. ఇక‌, ఇప్పుడు విశాఖ ఉక్కు స‌హా పోర్టుల‌ను కూడా ప్రైవేటీక‌రించ‌డం.. రాజ‌ధానిని మారుస్తామ‌ని చెప్పినా.. మౌనంగా ఉండ‌డం.. క‌ర్నూలుకు హైకోర్టు విష‌యంలోనూ తేల్చ‌క‌పోవ‌డం ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని డ‌మ్మీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అంటే.. రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్న వైసీపీ స్పందించ‌డం లేద‌ని… వైసీపీనే రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తోంద‌నేలా.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రిగి.. ఆ పార్టీకి దూరం కావ‌డం ద్వారా.. బీజేపీని ఎదిగేలా చేసుకోవ‌చ్చ‌నేది కేంద్ర పెద్ద‌ల భావ‌న‌గా ఉంది. అయితే.. ఇక్కడ ఓ కీల‌క ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. అస‌లు రాష్ట్రానికి అన్యాయం ఏదైనా జ‌రిగితే.. అది కేంద్రంలోని బీజేపీ వ‌ల్లే క‌దా.. ఆ పార్టీ ఎలా ఎదుగుతుంది? అనేది! అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేవారు ఉంటేనే క‌దా? అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ.. బీజేపీపై పన్నెత్తు మాట అన‌డం లేదు. పైగా ప్ర‌ధాని మోడీపై ఒక్క‌మాటంటే ఒక్క మాట అనే ధైర్య‌మూ వీరికి లేదు. ఈ కార‌ణంగానే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల‌ను డ‌మ్మీల‌ను చేసి.. తాను ఎద‌గాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.